మోడీ, ఇవాంకాలకు కేసీఆర్ ఇచ్చే కానుకలివే!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నగరానికి విచ్చేసే అతిథులకు ఇచ్చే కానుకలు సిద్ధం చేసినట్లు తెలిసింది. గ్లోబల్ ఎంటర్ప్రిన్యూర్షిప్ సమ్మిట్, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, జీఈఎస్లో పాల్గొనేందుకు వస్తున్న వైట్ హౌస్ సలహాదారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకాకు, ఇతర ప్రతినిధులకు కానుకలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ప్రధాని మోడీకి కాకతీయ కళాతోరణం, ఇవాంకాకు చార్మినార్ నమూనాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేగాక, ఇవాంకాకు ప్రత్యేకంగా గొల్లభామ చీరతోపాటు ముత్యాలు, గాజులను కూడా బహుమతులుగా అందించాలని భావిస్తున్నారు.
విదేశాంగా మంత్రి సుష్మా స్వరాజ్కు వీణ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్కు నెమలి ప్రతిమలను ఇచ్చి సత్కరించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేగాక, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుమతులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపాయి.
కాగా, ఇవాంకా ట్రంప్కు కోటి రూపాయలు నగ కూడా కేసీఆర్ అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.