అదే ఐతే మాకు ఓటు వేయొద్దు, కత్తులు తిప్పుతారా, సంగతి చెప్తా: జానారెడ్డికి కేసీఆర్ వార్నింగ్
వనపర్తి: కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం వనపర్తి ప్రజా ఆశీర్వాద వేదిక సభలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ పాలనను ఎండగట్టారు. కాంగ్రెస్ నేతలు గద్వాల సభలో కత్తులు తిప్పారని, వారి సంగతి తర్వాత చూస్తానని హెచ్చరించారు. ప్రాజెక్టుల కోసం తెరాస నేతలు అక్కడే నిద్రించి సాధించారన్నారు.
రాములమ్మ సినిమాలోని రామిరెడ్డిలో కేసీఆర్: విజయశాంతి, 'దుబాయ్ పంపే బ్రోకర్ పనులు చేశాడు'
మంత్రి హరీష్ రావు, తెరాస నేతలు ప్రాజెక్టుల కోసం అక్కడే నిద్రించారని కేసీఆర్ అన్నారు. మేం నిద్ర చేయకుంటే మరో ఇరవై ఏళ్లయినా కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి కాకపోయేదని చెప్పారు. సమైక్య పాలనలో అడవులు కూడా తొలిచేశారని ఆరోపించారు. అరవై ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన పాలమూరుకు ఇచ్చిన బహుమతి.. వలసల జిల్లా అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా అన్నారు. ముంబై బతుకులు అన్నారు.
తెలంగాణకు పట్టిన దరిద్రం కాంగ్రెస్
నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు పట్టిన దరిద్రం కాంగ్రెస్ అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది నెహ్రూ అన్నారు. ఏపీలో తెలంగాణను కలిపింది నెహ్రూ అని, హైదరాబాదులో విద్యార్థుల చావుకు కారణమై ఏపీలో కలిపారని, 1969లో 400 మంది విద్యార్థులను కాల్చి చంపింది ఇందిరా గాంధీ అని, ఆ తర్వాత సోనియా గాంధీ 14 ఆలస్యం చేసి తెలంగాణ ఇచ్చిందని, దీంతో వందల మంది యువకులు చనిపోయారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మాటలు నమ్మి ఆమె ఇవ్వలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి, ఆంధ్రా పాలకులకు బానిస అయ్యారని కేసీఆర్ మండిపడ్డారు. ఇక్కడి ప్రాజెక్టులు కట్టలేదని, బలవంతంగా కట్టినా నీరు నింపలేదన్నారు. తాను తెరాసను స్థాపించాక ఏమీ చంద్రబాబు.. జూరాల నింపవా అని అడిగితే అప్పుడు ఫలప్రదమైందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఏమాత్రం ఏమరుపాటున ఉన్నా మనం దెబ్బతింటామని ప్రజలకు చెప్పారు.
అదే అయితే టీఆర్ఎస్ను ఓడించండి
నేను చెప్పింది అబద్దం అయితే మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలలో డిపాజిట్ లేకుండా తెరాసను ఓడించండని, నేను చెప్పింది నిజమైతే 14 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ సూచించారు. తనది బక్క ప్రాణమైనా తెలంగాణ కోసం ఇంకా పోరాడుతున్నానని చెప్పారు. ఈ ఎన్నికలు మన జీవన పోరాటం అన్నారు. ఆరునూరైనా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలని చెప్పారు. ఆర్డీక్స్ కోసం ఆంధ్రా నేతలు బాంబులు పెడతారని, నేను దాని కోసం పాదయాత్ర చేస్తే, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే కర్నూలు నేత బాంబులు పెట్టి బద్దలు చేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. అప్పుడు తాను కూడా ధీటుగా మాట్లాడానని చెప్పారు. అరేయ్.. బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మాకు రెండు చేతులు ఉంటే, మీకు రెండు చేతులే ఉన్నాయని, మేమూ పేల్చేస్తామని హెచ్చరించానని అన్నారు. తెరాస నేతలు చేసిన పనిని కాంగ్రెస్ నేతలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మాకు కూడా బాంబులు వేసేవాడు ఒకడు పుట్టాడని పాలమూరు జిల్లా ప్రజలు అనుకున్నారని తనకు విలేకరులు చెప్పారని అన్నారు. ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక మనం పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు. మళ్లీ వచ్చాక 40 రిజర్వాయర్లు కడతామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలన్నారు.
14 నియోజకవర్గాల్లో తెరాసను గెలిపించాలి
ఈ ఎన్నికలను దయచేసి ఆషామాషీగా తీసుకోవద్దని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ తేకుంటే తనను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పానని, తెలంగాణ తెచ్చి పాదాల చెంత పెట్టానని, ఇప్పుడు మరో మాట చెబుతున్నానని, పాలమూరుకు 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారిచ్చే బాధ్యత తనది అన్నారు. మిషన్ భగీరథ ఓట్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని తాను చెప్పానని, 99 శాతం పూర్తయిందన్నారు. వనపర్తి సభలో నేను శపథం చేస్తున్నానని, 14నియోజకవర్గాల్లో తెరాసను గెలిపిస్తే 20 లక్షల ఎకరాలకు నీరు ఇస్తేనే పాలమూరులో ఓట్లు అడుగుతానని సవాల్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి పాలమూరుకు కూలీకి వచ్చేలా చేస్తానని చెప్పారు.
జానా కత్తులు తిప్పారు, ముందు ముందు చెబుతా సంగతి చెప్తా
నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చిమ్మ చీకట్లో ఉంటుందని శాపం పెట్టారని, కానీ ఇప్పుడు 24 గంటలు రైతులకు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ప్రజల బాధను పంచుకోలేదని చెప్పారు. కేసీఆర్ బట్టేబాజ్, దోఖేబాజ్ అంటూ ఓ పీసీసీ అధ్యక్షులు.. ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాటలాడారని మండిపడ్డారు. నిన్న గద్వాలలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డీకే అరుణ సహా పలువురు కత్తులు తిప్పారని.. తిప్పాల్సిన సమయంలో తిప్పలేదని, వారి సంగతి ముందు ముందు చెబుతానని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో మోసం జరిగిందని చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన అసెంబ్లీలో చర్చిద్దామంటే ముఖం లేకుండా, తెలివిలేక, అవగాహన లేక, బండారం బయటపడుతుందని కాంగ్రెస్ పారిపోయిందన్నారు. వారు ఎందుకు పారిపోయారో చెప్పాలన్నారు. ప్రజలు వారిని నిలదీయాలన్నారు.