కేబినెట్ కూర్పులో కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఓల్డ్ టీమ్ ఆల్ ఔట్.. కొత్త టీమ్ లో ఎవరెవరో?
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు ఎంతో కాన్ఫిడెంట్ గా వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అసెంబ్లీ రద్దు రోజునే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపిన గులాబీ బాస్ కు మంత్రివర్గం కూర్పు భారంగా పరిణమిస్తోందా? రెండోసారి అధికారంలోకి వచ్చాక 18 మంది మంత్రులను ప్రకటిస్తానని చెప్పి ఆలస్యం చేయడానికి కారణాలేంటి? ఇలాంటి ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలే సమాధానంగా కనిపిస్తున్నాయి.
అదలావుంటే కేబినెట్ కూర్పులో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. పాత టీమును మొత్తానికే వదిలేసి కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది.
నయా కేబినెట్.. "యంగ్" తరంగం
పాలనకు సంబంధించి కేసీఆర్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించడం, తలసాని శ్రీనివాస్ యాదవ్ పోర్టుఫోలియో మార్చడం లాంటివి తప్ప మంత్రివర్గం విషయంలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. అలాంటిది రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత మంత్రివర్గాన్ని మొత్తానికే ప్రక్షాళన చేస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓల్డ్ టీమును ఆల్ ఔట్ చేసి కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేసేలా నయా కేబినెట్ కూర్పు జరగబోతుందనే టాక్ వినిపిస్తోంది.
పాత మంత్రులు ఆల్ ఔట్.. కేటీఆర్ కోసమేనా?
రెండోసారి అధికారంలోకి వచ్చి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటున్నారు కేసీఆర్. సన్నిహితుడైన మైనార్టీ లీడర్ మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించడం, తనయుడు కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు అప్పగించడం.. ఇవన్నీ చూస్తుంటే ఇలాంటి కీలక పరిణామాలు ఇంకా చాలానే ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది. ఈనేపథ్యంలో కేటీఆర్ కు అనుకూలంగా ఉన్నవారికే మంత్రివర్గంలో చోటు దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి యంగ్ లీడర్లే కొత్త కేబినెట్ లో కొలువుదీరనున్నట్లు సమాచారం. కేటీఆర్ వయసుకు కాస్తా అటుఇటుగా ఉన్నవారు మంత్రులుగా ఐతే ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదనేది కేసీఆర్ అంతరంగంగా కనిపిస్తోంది.
అటు కొడుకు సెటిల్.. ఇటు అల్లుడి పరిస్థితేంటి?
తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు కూడా ఈసారి కేబినెట్ లో చోటు దక్కకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ట్రబుల్ షూటర్ గా పార్టీకి అండదండగా నిలిచిన హరీశ్ రావుకు మినిస్టర్ పోస్ట్ లేనట్లేనని ప్రచారం జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ లో మామ కేసీఆర్ ను గెలిపించేందుకు చక్రం తిప్పారనే పేరున్న హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎలా వాడుకోబోతున్నారనేది చర్చానీయాంశంగా మారింది.
హరీశ్ రావు విషయంలో కేసీఆర్ దృక్పథం వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని చూస్తున్న కేసీఆర్ కు ఎలాగూ పెద్ద టీమ్ అవసరమవుతుంది. జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు గానీ, వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించడానికి గానీ.. అనుభవమున్న లీడర్లు కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలవాల్సి ఉంటుంది. అందుకే హరీశ్ రావు ను ఆయనతో పాటు దేశ రాజకీయాల్లోకి తీసుకెళతారనే చర్చ జరుగుతోంది.
ఆల్ ఛేంజా?.. పాతోళ్లకు ఛాన్సుందా?
నయా కేబినెట్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్న తరుణంలో ఎవరెవరికీ చోటు దక్కనుందోననే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఓల్డ్ టీమ్ ఆల్ ఔట్ అనే ప్రచారం వినపడేసరికి పాత మంత్రివర్గంలోని పెద్దలకు షాకింగ్ న్యూస్ లా మారింది. ఏది ఎలా ఉన్నా.. పాత మంత్రివర్గం స్థానంలో కొత్తవారిని తీసుకునే యోచనలోనే ఉన్నారట గులాబీ బాస్. ఒకవేళ కొన్ని కీలక శాఖలకు కొత్తవారు సరిపోరు అనుకుంటే మాత్రం.. పాత మంత్రివర్గంలోని ముగ్గురు నలుగురు సీనియర్ల కుర్చీలకు ఢోకా లేదనే వాదన వినిపిస్తోంది. ఆర్థికశాఖపై మంచి పట్టున్న ఈటెల రాజేందర్ బడ్జెట్ కూర్పులో నేర్పరిగా కేసీఆర్ ప్రశంసలు పొందారు. అటు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా మంచి మార్కులే పడ్డాయి. అటవీశాఖ మంత్రిగా జోగు రామన్నకు కూడా మంచి రికార్డుంది. ఇలా ఈ ముగ్గురి నలుగురికి మళ్లీ మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
మరి పాత మంత్రివర్గం నుంచి ఆ కొందరు పెద్దల్ని తప్పించి కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది చర్చానీయాంశంగా మారింది. వారికున్న రాజకీయ అనుభవంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి బాధ్యతలు అప్పగించడం లేదంటే ఆయనతో పాటే దేశ రాజకీయాల వైపు తీసుకెళ్లడం జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.