కేసీఆర్కు మా మద్దతు అవసరం లేదు, మాకు ఏ డిమాండ్లు లేవు: అసదుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్లో కలిశారు. ఆయన ద్విచక్ర వాహనం పైన వచ్చారు. ఇరువురు దాదాపు నాలుగు గంటల పాటు చర్చించారు. తెరాసకు మద్దతు, హంగ్ వస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించారని తెలుస్తోంది.
షాకింగ్!: 'గజ్వెల్లో 50వేల ఓట్లతో ఓడిపోనున్న కేసీఆర్, డిపాజిట్ రాని పరిస్థితి'
మజ్లిస్ మద్దతు లేకుండా కేసీఆర్ సీఎం అవుతారు
భేటీ అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ను కలిశానని చెప్పారు. కేసీఆర్ సొంతగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తాను ధీమాగా ఉన్నానని చెప్పారు. మజ్లిస్ పార్టీ మద్దతు లేకుండానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అయినప్పటికీ మజ్లిస్ పార్టీ తెరాస వెంటే ఉంటుందని తెలిపారు.
బీజేపీ బలం ఏమిటో తేలిపోతుంది
తెలంగాణలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అసదుద్దీన్ చెప్పారు. ప్రజలు కేసీఆర్ను ఆశీర్వదించారని చెప్పారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలం ఏమిటో రేపు తేలిపోనుందని చెప్పారు. ప్రభుత్వంలో చేరాలనే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. రేపు మరోసారి కేసీఆర్ను కలుస్తానని చెప్పారు. పూర్తి మెజార్టీతో కేసీఆర్ ప్రమాణం చేస్తారని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు.
8 స్థానాల్లో గెలుస్తాం, డిమాండ్లు లేవు
మజ్లిస్ పార్టీ ఈసారి 8 స్థానాలలో గెలుస్తుందని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిపోనుందని అన్నారు. తమ మద్దతు కేసీఆర్కే ఉంటుందని తెలంగాణ అసెంబ్లీ రద్దయినప్పుడే స్పష్టంగా చెప్పేశామని ఆయన తెలిపారు. తమకు కేసీఆర్ ప్రభుత్వంలో చేరానే ఉత్సాహం ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి డిమాండ్లు లేకుండా కేసీఆర్ వెంటే ఉంటామని ఆయన చెప్పారు.
అందరిలో ఉత్కంఠ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి అసదుద్దీన్ తాము తెరాస వెంటే ఉంటామని చెబుతున్నారు. బీజేపీ కూడా మజ్లిస్ వెంట తెరాస లేకుంటే కేసీఆర్కు మద్దతిస్తామని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసదుద్దీన్, కేసీఆర్ భేటీ సుదీర్ఘంగా సాగటం గమనార్హం. కేసీఆర్ మళ్లీ నిలబడతారా లేక మహాకూటమి అధికారం చేజిక్కించుకుంటుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.