కీసర తహసీల్దార్ లంచం కేసు: నాగరాజు సహా నలుగురు ఏసీబీ కస్టడీకి
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ అవినీతి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాస్పద భూమి విషయంలో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ మరో ముందడుగు వేసింది.
ఈ కేసులో నలుగురు నిందితులను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారించిన కోర్టు.. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతిచ్చింది.
తహసీల్దార్ నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, వీఆర్ఏ సాయిరాజ్ను ఆగస్టు 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిచ్చింది. కోర్టు అనుమతి నేపథ్యంలో చంచల్గూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు కస్టడీలోకి తీసుకుని, నాంపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో విచారించనున్నారు.
ఈ కేసులో పట్టుబడిన రూ. కోటి పది లక్షలపై అధికారులు మరిన్ని వివరాలను రాబట్టనున్నారు. అంతేగాక, తహసీల్దార్ నాగరాజు సమక్షంలో బ్యాంక్ లాకర్ను కూడా తెరవనున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. అత్యంత విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరు మీద మార్చడానికి తహసీల్దార్ నాగరాజు రూ. 2 కోట్లు లంచం డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్ కలిసి నాగరాజుకు రూ. కోటి 10 లక్షలు లంచం ఇచ్చారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలావుంటే, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ ప్యాడ్ అక్కడ ఉండటంతో రాజకీయ ఆరోపణలు, ప్రత్యాపరోణలకు దారితీసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రేవంత్ రెడ్డి స్పందించారు. కీసర తహసీల్దార్ ఏసీబీకి చిక్కిన వ్యవహారంలో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Recommended Video
కాగా, కీసర తహసీల్దార్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు ఆయన తెలిపారు. తన లెటర్ హెడ్స్ లభించడంలో తప్పేముందన్న రేవంత్ రెడ్డి.. అందులో ఉన్న సమాచారానికి కీసర వ్యవహారానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ వ్యవహారంలో ఒక్క పైసా సంబంధమున్నా శిక్షకు సిద్ధమని రేవంత్ తేల్చిచెప్పారు.