కీసర తహసీల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్లో ఒకటిన్నర కిలోల బంగారం: సీజ్
హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన అక్రమాస్తులు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా, అతని బ్యాంక్ లాకర్ను ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్లోని ఓ బ్యాంక్ లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎట్టకేలకు లాకర్ తెరిచిన అధికారులు..
ఆగస్టు 14వ తేదీన నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంక్ లాకర్కు సంబంధించిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన నరేందర్ పేరిట అల్వాల్లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్దిగా గుర్తించారు. అయితే, ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని తెలిసింది. ఎట్టకేలకు ఆ లాకర్ను ఏసీబీ అధికారులు తెరిచి.. అందులోని 1532 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నవారువాటిని ఏసీబీ న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు.
సామాన్యుల నుంచి అధికారుల వరకు నాగరాజు బాధితులే..
ఇది ఇలావుంటే, నాగరాజుపై అవినీతి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఆగస్టు 14న రూ. కోటి పది లక్షల నగదును లంచంగా తీసుకుంటూ తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి రెండ్ హ్యాండెడ్గా చిక్కడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అతని బాధితుల్లో సామాన్యుల నుంచి వివిధ శాఖల అధికారులు కూడా ఉండటం గమనార్హం.
ఇప్పుడు ఆ బాధితులంతా నాగరాజుపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ ఎస్పీ ర్యాంకు మాజీ అధికారి మీడియా ముందుకు వచ్చి నాగరాజు అవినీతి, వేధింపుల గురించి వివరించడం గమనార్హం.
Recommended Video
నాగరాజు బెయిల్ పిటిషన్..
కాగా, నాగరాజు వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక భారీ మొత్తంలో లంచం తీసుకున్న తహసీల్దార్ నాగరాజును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించాలంటూ పలువురు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే.