కేసీఆర్ కేబినెట్లోకి కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి..? ఐటీ శాఖ మంత్రిగా.. కేటీఆర్ పరిస్థితేంటి ?
హైదరాబాద్ : కేసీఆర్ కేబినెట్లో కొత్త ముఖాలు కనిపించనున్నాయా..? త్వరలో కేసీఆర్ కేబినెట్లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా కొందరి మంత్రులపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మంచి ఫలితాలు తీసుకురావడంలో విఫలమైతే మంత్రులపై వేటు కూడా వేస్తానని కేసీఆర్ హెచ్చరించారు కూడా. ఇప్పుడు తాజాగా కేసీఆర్ కేబినెట్లోకి ఒక కొత్త ముఖం రాబోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరు..?
కేరళ ఐపీఎస్ అధికారి లక్ష్మణ్కు చోటు
సీఎం కేసీఆర్ తన కేబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కేబినెట్లో ఓ పోలీస్ ఉన్నతాధికారికి స్థానం కల్పించనున్నట్లు సమాచారం. కేరళ కేడర్ ఐపీఎస్ జీ లక్ష్మణ్కు కేసీఆర్ తన కేబినెట్లో చోటు కల్పిస్తారని సమాచారం. 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారి లక్ష్మణ్. ప్రస్తుతం లక్ష్మణ్ కేరళ పోలీస్ శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సోషల్ పోలీసింగ్ ట్రాఫిక్ వింగ్లకు ఐజీగా ఉన్నారు. త్వరలోనే తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి మంత్రిగా బాధ్యతలు చేపడుతారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో ఈ విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చిన లక్ష్మణ్
ప్రస్తుతం లక్ష్మణ్ హైదరాబాదులోనే ఉన్నారు. మరో రెండ్రోజుల్లో ఆయన కేరళకు వెళతారని సమాచారం. తాను కేసీఆర్ కేబినెట్లో చేరుతున్నట్లు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ చెప్పారట. తనకు ఏ పదవి వస్తుందో కూడా ఆ పత్రికతో చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ తనకు ఐటీ పోర్ట్ఫోలియోను కేటాయించనున్నట్లు లక్ష్మణ్ చెప్పారట.ఇప్పటికే కేరళ పోలీస్ చీఫ్ లోకనాథ్ బెహెరాకు ఈ విషయం చెప్పినట్లు లక్ష్మణ్ చెప్పారు. ఇంకా 14 ఏళ్ల పాటు సర్వీసు ఉండగానే తాను రాజీనామా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు లక్ష్మణ్. ఇప్పటికే లక్ష్మణ్ బంధువులు చాలామంది తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. 2009, 2014, 2019లోనే పోటీ చేయాలని చెప్పినప్పటికీ లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు.
ఎవరు ఈ లక్ష్మణ్ ..?
లక్ష్మణ్ ఖమ్మం జిల్లా వాసి. అలపుజా ఏఎస్పీగా తన కెరీర్ను ప్రారంభించారు. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతం, క్రైమ్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో సేవలందించారు. అంతేకాదు బీఎస్ఈ, ఎస్ఎమ్ఈ సీఈఓగా నాలుగేళ్ల పాటు సేవలందించారు. ఇక లక్ష్మణ్ ఉమ్మడి ఏపీ డీజీపీగా పనిచేసిన డీటీ నాయక్ కుమార్తె డాక్టర్ కవితను వివాహం చేసుకున్నారు.
కేటీఆర్కు ప్రమోషన్.. మరి హరీష్ రావు పరిస్థితేంటి..?
ప్రస్తుతం ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్కు త్వరలోనే సీఎంగా లేదా డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ వస్తుందనే వార్తలు ప్రచారంలోకి రావడం.. లక్ష్మణ్కు ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తానే స్వయంగా చెప్పడం వంటివి త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే మరోవైపు హరీష్ రావు స్థానంలో లక్ష్మణ్కు ఆర్థికశాఖ అప్పగించాలనే ఆలోచనలో కూడా సీఎం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాలున్నాయి.