కెసిఆర్, నాయినిలపై కేసులు పిల్ల చేష్టలు: కేశవరావు
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారానికి సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చుతున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, హోంమంత్రి నాయినిపై ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేయటం పిల్లల చేష్టలు మాత్రమేనని పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు విమర్శంచారు.
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించిన అఖిల పక్ష కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జిహెచ్ఎంసి కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు అడిగి ప్రశ్నలకు స్పందించిన కేశవ రావు మాట్లాడారు.
ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా, ఎవరిపైనైనా ఫిర్యాదులు చేసుకోవచ్చునని వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిందని మాత్రం ఎన్నికలు జరగటం, ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించటం, డబ్బులు పంచటం వంటి వ్యవహారాలకు సంబంధించి రుజువులు, ఆధారాలున్నాయని వివరించారు.
ఏ ఫిర్యాదుకైనా రుజువులు , న్యాయపరమైన విచారణలుంటాయని ఆయన వివరించారు. అసత్యమైన, అర్ధరహితమైన ఫిర్యాదులు ఎప్పటికైనా అవి అబద్దమేనన్న విషయం తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వెల్లడించారు.