పాల పొంగులా పొంగిన కేకే..! అసలు కథ అదేనట..! చల్లగా కథ ముగించిన కేసీఆర్..!!
హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతల వ్యవహారం విచిత్రంగా, వింతగా ఉంటుంది. తమకు ప్రచారం తగ్గిందనో, మీడియాలో ప్రముఖంగా నిలవాలనుకునో, లేక చేజారిపోతున్న పదవిని మరొక్క సారి చేజిక్కించుకోవాలనో కొన్ని రాజకీయ విన్యాసాలు చేస్తుంటారు. అందుకోసం తమకు సంబంధం లేని అంశంలో తల దూర్చి తమాషా చేయాలనుకుంటారు. పరిస్థితులు తమకు అనుకూలంగా మారినా, మారక పోయినా ఓ బాణం వేసి చూద్దాం అనుకుని కొన్ని సందర్బాల్లో ఫలితం పొందుతారు.. మరి కొన్ని సందర్బాల్లో ఘోరంగా అబాసుపాలవుతుంటారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ ఎంపి కే.కేశవ రావు అలియాస్ కేకే ప్రస్తుతం ఇదే పరిస్ధితిలో ఉన్నారు.
వ్యూహాత్మకంగా తెరమీదకు వచ్చిన కేకే.. పార్టీలో ఆసక్తికర చర్చ..
గులాబీ పార్టీ సీనియర్ ఎంపీ కే కేశవ రావు అకస్మాత్తుగా తెరమీదకు వచ్చారు. చాలా రోజులుగా కేశవ రావు పదవిలో ఉన్నారా లేక ఎంపీ పదవి ముగించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారా అని తెలంగాణ ప్రజానికానికి సందేహం కలిగేంతగా ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. కాని ఉన్నట్టుండి ఆయన మీడియాలో ఓ సంచలన వార్తతో తళుక్కున మెరిసారు. రోజంతా ఆయన గురించి రకరకాల కథనాలే..! రసవత్తరమైన స్టోరీలే..! మీడియా ఫోకసంతా ఆయన మీదే కేంద్రీకరించడంతో కేకే ఉక్కిరిబిక్కిరైనంత పనైనట్టు చర్చ జరుగుతోంది. దీంతో కేకే అసలు దేనికి ఉత్సాహ పడుతున్నారో తెలుసుకోవాలనే కూతూహలం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు కలిగినట్టు సమాచారం. దీంతో గురువారం కేకేని ప్రగతి భవన్ పిలుపించుకుని చంద్రశేఖర్ రావు కిందనుంచి మీద వరకు "డౌట్లు" క్లియర్ చేసినట్టు సమాచారం. దీంతో కేకే కూడా ఓ రేంజ్ లో "సంతృప్తి" పడ్డట్టు తెలుస్తోంది.
ఆర్టీసి సమ్మె సమస్య పరిష్కరిస్తానన్న కేకే.. ఆశ్చర్యపోయిన గులాబీ దళం..
టీఆర్ఎస్ పార్టీలో కేశవరావు వ్యవహారంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేకే లేఖ రాయడం, సమస్యను తాను చాకచక్యంగా పరిష్కరిస్తాననడం పార్టీలో దుమారాన్ని రేపింది. తాను కార్మిక పక్షపాతి అని, రాజ్యం పక్షాన ఉండబోనని, సీఎం ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతామంటూ అంటూ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ప్రెస్ నోట్, చిట్ చాట్లతో సంచలనం సృష్టించారు. అయితే గత కొన్నేళ్లుగా సైలెంట్ ఉన్న కేశవరావు ఇప్పుడు సడెన్గా తెరపైకి రావడం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న ఆర్టీసీ సమ్మెపై మధ్యవర్తిత్వం వహిస్తానంటూ కామెంట్లు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కేకే హడావిడి పట్ల కేసీఆర్ ఆరా.. ప్రగతిభవన్ పిలిపించిన గులాబీ బాస్..
ఇదిలా ఉండగా తన రాజ్యసభ సీటు విషయంలో గులాబీ బాస్ నుండి స్పష్టత రాకపోవడం వల్లే కేకే హడావిడి చేస్తున్నట్టు గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. 2014 ఏప్రిల్ లో రాజ్యసభకు కేకే ఎన్నికయ్యారు. 2020 ఏప్రిల్ లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. దీంతో పదవి రెన్యూవల్ కోసం ఆయన చంద్రశేఖర్ రావును కలిసినట్లు సమాచారం. అయితే సీఎం నుంచి సానుకూలంగా స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో కేకే తన దారి తాను చూసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈక్రమంలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే కాపు వర్గం పై కన్నేసి కీలక నేతలకు వెల్కం బోర్టు తగిలించిన విషయం తెలిసిందే.
ఎంపీ పదవి రెన్యువల్ కోసమే హడావిడి.. సెట్ చేసి పంపించిన కేసీఆర్..
రాజ్యసభ సీటు రెన్యూవల్ కోసం కేకే లేఖల అస్త్రాన్ని వదిలారని పార్టీలో చర్చ నడుస్తోంది. తనకు సంబంధం లేకున్నా ఆర్టీసి ఉద్యోగులతో నెలకొన్న వైరుద్య వాతావరణాన్ని పరిష్కరిస్తానని చెప్పడంలో కూడా వ్యూహాత్మకమే అంటున్నారు గులాబీ నేతలు. చంద్రశేఖర్ రావు మూడో వ్యక్తి ప్రమేయం కోరుకుంటే కేటీఆర్ లేదా హరీష్ రావుకు ప్రాధాన్యత ఇస్తారు గానీ కేకే లాంటి నేతకు అవకాశం ఇవ్వరనే చర్చ కూడా జరుగుతోంది. కేకే హడావిడి ప్రకటనలతో తేరుకున్న గులాబీ బాస్, ఆయనను ప్రగతిభవన్కు పిలిపించి సుధీర్ఘంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. చంద్ర శేఖర్ రావు తరహాలో అన్ని విధాలుగా కేకేను సంతృప్తి పరిచి పంపించినట్టు సమాచారం.