'కొణిజేటి రోశయ్య తమిళనాడులో పరోక్షంగా చాలా చేశారు'
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ఆగస్టు 31వ తేదీతో (రెండు రోజుల క్రితం) పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మీడియాతో పంచుకున్నారు.
ఆయన మాటల్లోనే.. 'రోశయ్య గారితో నా ప్రయాణం సుదీర్ఘ కాలం. 80వ సంవత్సరం నుంచి వారితో నాకు పరిచయం. చీరాల ఉప ఎన్నికలకు రోశయ్య గారు, నేటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంఛార్జులుగా ఉన్నారు.
వారితో అప్పుడు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా వారితో పని చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోశయ్య గారిలో అదే పలకరింపు. అదే అప్పయత. చెన్నైలోని తెలుగు సంఘాలకు సంభంధించిన వారు నా ప్రకటనల గురించి చాలసార్లు వారికి విన్నవించినప్పుడు.. అయన చాలా స్పీడ్ అని రోశయ్య గారు చెప్పేవారని సదరు తెలుగు నాయకులు నాకు తెలిపే వారు.
రోశయ్య గారు, నేను కలిసినప్పుడు చాలా అప్యాయంగా.. తెలుగు భాష కోసం నువ్వు చాలా బాగా పని చేస్తున్నావని మెచ్చుకునే వారు. ఈ ఐదేళ్లలోనేను చేపట్టిన ప్రతీ ఉద్యమం వివరాలను వారికి తొలుత తెలియజేసి, ఆ తర్వాత చేపట్టేవాడిని.
రోశయ్య గారికివే వందనలు. శత కోటి వందనాలు. రోశయ్య గారు ప్రత్యక్షంగా తెలుగు ఉద్యమానికి సంఘీభావం తెలపకపోయినా పరోక్షంగా చాలా మేలు చేశార'ని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. తమిళనాడు గవర్నర్గా రాజ్యాంగ రక్షకులను నియమించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ప్రస్తుతం అల్ప సంఖ్యాక భాషా ప్రజల పైన రాజ్యంగా ఉల్లంఘన జరుగుతోందని, కాబట్టి అల్ప సంఖ్యాక భాషా వర్గాల హక్కులను కాపాడే వారిని గవర్నర్గా నియమించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయాలకు దూరం: రోశయ్య
తమిళనాడు గవర్నర్గా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కొణిజేటి రోశయ్య.. ఇకపై విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు బాధ్యతలు అప్పగించి హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి మరోసారి ప్రవేశించనని చెప్పారు. తన జీవితంలో అరవై ఏళ్ల పాటు రాజకీయాలతోనే సరిపోయిందన్నారు. ఇకపై కాంగ్రెస్లోనూ కొనసాగాలని భావించడం లేదన్నారు. ఏపీలో తాను నివాసాన్ని కోరుకోవడం లేదని, కాబట్టి ఏపీ రాజకీయాలు సైతం తనకు వద్దని రోశయ్య చెప్పారు.