కేసీఆర్ పాలనపై నందమూరి సుహాసిని తీవ్ర ఆగ్రహం, ఆమె గెలిస్తే కీలక పదవి: కాంగ్రెస్ నేత హామీ
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఆదివారం చెప్పారు. మహా కూటమి అధికారంలోకి వస్తే సుహాసినికి మంత్రి పదవి ఇస్తామని చెప్పారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తనకు ఆసక్తి లేదని, కానీ పార్టీ ఆదేశానుసారం పోటీ చేస్తున్నానని ఆయన చెప్పారు. కంటోన్మెంట్ నుంచి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోకసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పెద్దిరెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపుకు నేను సహకరిస్తానని చెప్పారు.
బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు!
కేబినెట్లోకు సుహాసిని
శనివారం కూకట్పల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సర్వే సత్యనారాయణ, నందమూరి సుహాసిని, ఈ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడారు. మహాకూటమి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూకట్పల్లి నుంచి విజయం సాధించే నందమూరి సుహాసినికి కేబినెట్లో స్థానం కల్పిస్తామన్నారు.
ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలి
టీడీపీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ... ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి సుహాసినిని మన ఆడబిడ్డగా ఆశీర్వదించి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సుహాసిని గెలుపు ఖాయమని, అఖండ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.
రాక్షస పాలన అంటూ సుహాసిని ఆగ్రహం
నందమూరి సుహాసిని మాట్లాడుతూ... ప్రస్తుతం నడుస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పలకాలని కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనకు ఓట్లు వేసి గెలిపిస్తే, కూకట్పల్లి నియోజకవర్గంలో స్థానికంగానే ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు అండగా ఉంటానని చెప్పారు.
సుహాసినికి కుటుంబం అండ
కాగా, నందమూరి సుహాసిని తరఫున ఆ కుటుంబ సభ్యులు పలువురు ప్రచారంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని చెబుతున్నప్పటికీ ఆ అవకాశం లేదని సమాచారం. మరోవైపు, నందమూరి తారకరత్న ప్రచార బరిలోకి దిగుతున్నారు. అక్క సుహాసిని తరఫున తారకరత్న ప్రచారం చేస్తారని పార్టీ, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన అక్క గెలుపు కోసం కృషి చేస్తానని, అక్క గెలుపు పెదనాన్న హరికృష్ణకు ఘన నివాళి ్ని, రాజకీయాల్లో పెదనాన్న లేని లోటును అక్క విజయంతో పూడ్చుతామని చెప్పారు.