కేసీఆర్ నియోజకవర్గంలో కేజీ నుంచి పీజీ విద్య..!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తన మానసపుత్రికగా చెప్పే 'కేజీ నుంచి పీజీ ఉచిత విద్య' పథకానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ పథకం అమలును పరశీలించేందుకు, అక్కడ కేజీ నుంచి పీజీ వరకు విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రి మండలి తీర్మానించి, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంది. దీంతో సీఎం కేసీఆర్ ఈ పథకం అమలు తీరును పరిశీలించాలనే ఉద్దేశ్యంతో ప్రయోగాత్మకంగా తన నియోజకవర్గంలో అమలుచేయాలని భావించారు.
తన నియోజక వర్గంలో అమలు చేయాలని ప్రభుత్వ యంత్రంగాన్ని ఆదేశించారు. దీంతో జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లిలో బాలికల గురుకులు పాఠశాల, కళాశాలలను బీసీ సంక్షేమ శాఖ మంజూరు చేసింది. ఇక్కడ కేజీ నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదువును అందిస్తారు.
గజ్వేల్ మండలం మిత్రాజ్ పల్లిలో బాలికల గరుకుల డిగ్రీ కళాశాలనూ ఆ శాఖ మంజూరు చేసింది. పీజీ కోర్సుల నిర్వహణకు మరో విద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే ఇది మంజూరు కానుంది. దీంతో గజ్వేల్లో వచ్చే ఏడాది నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ప్రవేశాలు కల్పించనున్నారు.