రికార్డు: గతం కంటే భిన్నంగా, ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం
హైదరాబాద్: మహా గణనాథుల నిమజ్జనాలతో నగరంలో మహా సంబరం మొదలైంది. గురువారం ఉదయం నుంచే గణపతి నిమజ్జనాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణనాయకుడు కూడా ఉదయమే ఊరేగింపుగా కదిలాడు. నిమజ్జన వేడుకకు నలుమూలాల నుంచి భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు.
హుస్సేన్ సాగర్కు తరలుతున్న గణనాథులతో, ప్రజల ఆటపాటలతో నగరం సందడిగా మారిపోయింది. ఎటుచూసినా కోలాహలమే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా ముందుగానే ఖైరతాబాద్ మహగణపతిని నిమజ్జనం పూర్తయింది. అత్యంత కోలాహలం నడుమ ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరాగా.. భారీ క్రేన్ సాయంతో గణనాథుడిని ట్యాంక్బండ్లో నిమజ్జనం చేశారు.
ఈ వేడుకను చాలామంది ప్రత్యక్షంగా తిలకించారు. గత ఏడాది వరకు అన్ని వినాయకుల నిమజ్జనం పూర్తయిన తర్వాతే ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు సమయంలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనోత్సవం ముగిసింది.
ఉదయం 8 గంటలకు శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు ఈసారి ఆరు గంటల్లోనే నిమజ్జనం పూర్తిచేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రంలోగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
దాదాపు గురువారం 30వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. హుస్సేన్ సాగర్ సహా నగరంలో పదిచోట్ల నిమజ్జనోత్సవాలు జరగనున్నాయి. దాదాపు 100 మార్గాల నుంచి గణనాథులు తరలివస్తున్నారు. 225 కిలోమీటర్ల మేర శోభాయాత్రల జరగనున్నట్టు భావిస్తున్నారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలో 20వేల ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఒక పక్క బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా.. నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ తో సహా నగరంలోని పెద్ద జలాశయాల వైపు గణనాథులు తరలిపోతున్నారు.
గణేష్ నిమజ్జనోత్సవంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ సమీక్ష నిర్వహించారు. ట్యాంక్బండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
గణనాథుల నిమజ్జనం సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సుమారు 25వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భద్రతా దళాలు మోహరించాయి.
పడిపోయిన విగ్రహం
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఊపందుకుంది. కొన్ని చోట్ల ప్రశాంతంగా జరిగినా, కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.14లో వెంకటేశ్వర నగర్లో క్రేన్ ద్వారా లారీలో ఎక్కిస్తుండగా గణేష్ విగ్రహం కూలిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన చేశారు. వారికి పోలీసులు సర్దిచెప్పి గణనాధుడ్ని క్రేన్ తో నిమజ్జనానికి తరలించారు.
నాలాలో పడి యువకుడు గల్లంతు
హైదరాబాద్ నగరంలోని నాగోల్లోని రత్నవైన్స్ వద్ద ఓ యువకుడు నాలాలో పడిపోయాడు. గురువారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. కాగా, నాగోల్లో వరద నీరు నాలాలోకి భారీగా ప్రవహిస్తున్న సమయంలో రోడ్డు దాటుతూ యువకుడు నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు యువకుడి కోసం గాలింపు చేపట్టారు.