బాలాపూర్ గణేష్ నిమజ్జనం: మహబూబాబాద్లో రోప్ తెగి వాగులో పడ్డ డీఎస్పీ
భాగ్యనగరంలో వినాయకుడి నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్బండ్, సరూర్ నగర్ మినీ ట్యాంక్బండ్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. నిమజ్జనాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో వినాయకుడి నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్బండ్, సరూర్ నగర్ మినీ ట్యాంక్బండ్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. నిమజ్జనాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
బుధవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ భగవత్ తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ప్రధాన విగ్రహాలైన ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యింది. మధ్యాహ్నం రెండు గంటలకే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయగా, సాయంత్రం ఐదున్నర గంటలకు బాలాపూర్ వినాయకున్ని నిమజ్జనం చేశారు.
పోలీస్ యంత్రాంగానికి రాష్ట్ర హోమంత్రి నాయిని నర్సింహ రెడ్డి అభినందనలు తెలిపారు. భాగ్యనగరంలో జరుగుతున్న గణేష్ శోభాయాత్రలను హోంమంత్రి నాయిని, అడిషనల్ డీజీపీ అంజనీకుమార్, సీపీ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డిలు కలిసి ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు.
అనంతరం నాయిని మాట్లాడారు. గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. పోలీసులు, అధికారులు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను కొనసాగించినట్లు చెప్పారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలుసుకుని పరిష్కరించారన్నారు.
మహబూబాబాద్లో క్రేన్ రోప్ తెగి నీళ్లలో పడ్డ డీఎస్పీ మీడియా ఫోటో గ్రాఫర్లు
మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు వాగు వద్ద వినాయకుడి నిమజ్జనోత్సవంలో ప్రమాదం తప్పింది. క్రేన్ తీగ తెగిపోవడంతో డీఎస్పీ రాజమహేంద్ర, ముగ్గురు పత్రికా ఫోటోగ్రాఫర్లు వాగులో పడిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది ఈ నలుగురిని రక్షించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నీరు లోతుగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది.