నేతలను కవ్విస్తున్న ఖైరతాబాద్..! సైకిల్ సవారీ దూసుకెళ్తుందా..?
హైదరాబాద్ :తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. నియోజక వర్గాల్లో అభ్యర్థుల హడావిడి కూడా మొదలైపోయింది. జంటనగరాల్లో కీలక నియోజక వర్గమైన ఖైరతాబాద్ లో మాత్రం అకడజనుకు పైగా నేతలు టికెట్ ను ఆశిస్తున్నారు. అదికార గులాబీ పార్టీతోపాటు ఇతర పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొన్న ఖైరతాబాద్ లో విజయం ఎవరిని వరిస్తుందో అనే అశం ఉత్కంఠగా మారింది. మంత్రులు, ప్రముఖులందరి నివాసాలు ఇక్కడే ఉండటంతో ఎటువంటి ఎన్నికలు జరిగినా ఇక్కడి పరిణామాలను అందరి ద్రుష్టిని ఆకర్శిస్తుంటాయి. దానం నాగేందర్ చేరికతో టీఆర్ఎస్ లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు టికెట్టు ఆశిస్తున్న కార్పొరేటర్లు విజయారెడ్డి, గద్వాల్ విజయలక్ష్మి, మన్నెగోవర్దన్రెడ్డి గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు.
టీఆర్ఎస్లో ఖైరతాబాద్ హాట్ సీట్..! అభ్యర్థుల అంశంలో మాత్రం టెన్షన్..!!
టీఆర్ఎస్లో ఖైరతాబాద్ హాట్ సీటుగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అరడజనుకు పైగా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. తన అంతరంగాన్ని ఇప్పటికే హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సినీ నటుడు అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి కూడా టీఆర్ఎ్సలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తాను జూబ్లీహిల్స్లో నివాసముంటున్న నేపథ్యంలో తనకు ఖైరతాబాద్ ఇవ్వాలని కోరినట్లు ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికి రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక చాలా కష్టతరంగా మారిందని సీనియర్లు అంటున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థుల మద్య తీవ్ర పోటీ..! ఎవరికి దక్కుతుందో టికెట్..!
గులాబీ పార్టీలో ఖైరతాబాద్ నుంచి టికెట్టు కోసం ఆశిస్తున్న వారిలో దానం నాగేందర్, కార్పొరేటర్లు విజయారెడ్డి, గద్వాల్ విజయలక్ష్మి, మన్నెగోవర్ధన్రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. వీరంతా గతంలో ప్రత్యర్థులే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి టికెట్టు ఆశించి భంగపడ్డ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వైఎస్సార్సీపీలో చేరి 2014లో టికెట్టు సంపాదించారు. టీఆర్ఎస్ నుంచి మన్నెగోవర్ధన్రెడ్డి బరిలో దిగాడు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అయితే వీరంతా ఖైరతాబాద్ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న వారే..!
టీడిపి తరుపున లంకల దీపక్ రెడ్డి..! గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న యువ నేత..!!
నియోజకవర్గంలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ కూడా ప్రత్యేక క్యాడర్ ఉంది. అన్ని పార్టీలూ బలంగానే ఉండటంతో విజయం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో సీనియర్లు పార్టీ మారారు. కానీ కార్యకర్తల అండ పార్టీకి బలంగా ఉందని తెలుస్థోంది. అంతే కాకుండా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న వారిలో కొందరు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారు. తెలుగు యువతవిభాగంలో చురుగ్గా పని చేసిన లంకల దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున బరిలో దిగబోతున్నారు. ఈ మేరకు ఆయనకు అదిష్టానం నుండి సంకేతాలు అందినట్టు తెలుస్తోంది.
నేతలు మారినా కార్యకర్తలు మారలేదు..! గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న యువ నేత..!!
పొత్తులో భాగంగా ఖైరతాబాద్ సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే తిరుగులేని మెజారిటీతో గెలుస్తామని లంకల దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 16ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ తరుపున నియోజక వర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు, స్థానికంగా ఉన్న ఎన్నో సమస్యలను తాను పరిష్కరించినట్టు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ నియోజకవర్గంలో తాను ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నట్టు తెలుస్తోంది. 2014లో ఖైరతాబాద్ సీటు మిత్రపక్షంలో భాగంగా బీజేపికి కేటాయించినా అక్కడ చింతల రాంచంద్రారెడ్డిని గెలిపించింది టీడిపి క్యడర్ అనే చర్చ జరుగుతోంది. తాజాగా టికెట్ టీడిపి కి కేటాయిస్తే తెలుగుదేశం అభ్యర్థి గెలుపు తద్యమని స్థానిక ప్రజానికం చెప్పుకొస్తోంది. హేమాహేమీలు బరిలో నిలుస్తున్న తరుణంలో ఖైరతాబాద్ ఎవరికి అనుకూలంగా మారుతుందో చూడాలి.