భూమి మాయం చేశారు.. రికార్డుల్లో పేరు మార్చారు.. గోతిలోకి దిగి జర్నలిస్ట్ వింత నిరసన (వీడియో)
ఖమ్మం : వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా.. మనకు అందాల్సినవి అందుతాయనే సామెత ఉంది. అదే వడ్డించేవాడు మనవాడు కాకుంటే ఎక్కడ కూర్చున్నా ఫలితముండదు అనేదానికి ఈ సామెత నిదర్శనం. అదే కోవలో రెవెన్యూ అధికారుల లీలలు బయటపడుతున్నాయి. ఒకరి భూమి మరొకరికి కట్టబెడుతూ కాసుల దందాకు తెరలేపుతూ వ్యవస్థపై నమ్మకం లేకుండా చేస్తున్నారనే వాదనలు కొకొల్లలు. తాతల నుంచి సంక్రమిస్తున్న భూముల్ని సైతం ఇతరులకు కట్టబెడుతున్న ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ భూమి మాయం చేసిన వైనం చర్చానీయాంశమైంది.
భూమి మాయం.. రికార్డులు మార్చి..!
వ్యవస్థలోని తప్పులను ఎత్తిచూపే జర్నలిస్ట్ ఇప్పుడు బాధితుడిగా మారాడు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పాలకులను, అధికారులను నిలదీసే జర్నలిస్ట్ తన వంతు వచ్చేసరికి నిస్సహాయుడిగా మారాడు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతులను చేసే జర్నలిస్ట్ ఇప్పుడు తన భూమి కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి ప్రముఖ దినపత్రికల్లో పనిచేసి ఇప్పుడు ఓ ప్రైవేట్ ఛానల్లో కొనసాగుతున్నారు. అయితే తన తాతల నుంచి సంక్రమించిన భూమిని ఇతరులకు కట్టబెట్టారు రెవెన్యూ అధికారులు. విషయం తెలిసి వారిని వివరణ అడిగితే బుకాయిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ఈ సమస్యపై పోరాడుతున్నప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదు. దాంతో వింత నిరసనకు దిగారు.
సీఎం కేసీఆర్ ఇలాకాలో మరో షాక్.. మల్లన్న సాగర్ కేసులో హైకోర్టు ఝలక్.. మరో ఇద్దరికి జైలు శిక్ష!
రెవెన్యూ అధికారుల లీలలు..!
తెలంగాణలో భూరికార్డుల భద్రతపై ఇప్పటికే పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూప్రక్షాళన పేరుతో ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జర్నలిస్ట్కు జరిగిన అన్యాయం చర్చానీయాంశమైంది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గళమెత్తుతూ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే జర్నలిస్టు భూమి మాయమైన ఘటన హాట్ టాపికయింది.
ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉండి సమాజంలోని మంచిచెడులను వార్తలుగా మలచి సీనియర్ జర్నలిస్టుగా కొనసాగుతున్న నాగేందర్ రెడ్డి భూమి మాయమైంది. ఇదేంటని రెవెన్యూ అధికారుల చుట్టూ ఏడాదిన్నరగా తిరుగుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో రెవెన్యూ అధికారుల తీరును తప్పుపడుతూ ఆయన వ్యవసాయ భూమిలోనే గోతి తవ్వి మూడొంతులకు పైగా శరీరాన్ని పూడ్చి వింత నిరసనకు దిగారు.
జర్నలిస్ట్ భూమి మాయం.. రికార్డులు తారుమారు..!
ఉమ్మడి ఖమ్మం జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన మారెడ్డి నాగేందర్ రెడ్డి కుటుంబానికి తాతల నుంచి కొంత వ్యవసాయ భూమి సంక్రమించింది. అయితే ఆయన తండ్రి అప్పిరెడ్డి మరణించాక రెవెన్యూ రికార్డులను పరిశీలించడంతో తమ భూమి మాయమైనట్లు గుర్తించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులు రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్లు తేల్చారు. 2012 - 2013 మధ్యలో అక్రమంగా ఆర్.ఓ.ఆర్ చేసినట్లు నిర్ధారించుకున్నారు.
ఆ క్రమంలో రెవెన్యూ శాఖలో తమ భూమికి సంబంధించిన రికార్డులను ట్యాంపరింగ్ చేశారని ఆధారాలతో సహా ఉన్నతాధికారులను కలిశారు నాగేందర్ రెడ్డి. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఉచిత సలహాలు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. కనీసం పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయంపై ఆరా తీయలేదని మండిపడుతున్నారు. అవినీతి అధికారులు తమ భూమిని మాయం చేసి ఇతరులకు ధారాదత్తం చేయడంతో రెండేళ్ల నుంచి తమకు రైతు బంధు పెట్టుబడి సాయం కూడా అందడం లేదని నిరసనకు దిగారు.
న్యాయం కోసం పోరాటం.. గోతి తవ్వి అందులో..!
22 సంవత్సరాల నుంచి మీడియాలో పనిచేస్తున్న తనకే ఇలాంటి సమస్య ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు నాగేందర్ రెడ్డి. ఇన్నేళ్లుగా ఎందరో అవినీతి అధికారుల బాగోతం బయటపెట్టానని.. కానీ చివరకు తనకే అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేకపోతున్నానని వాపోయారు. అందుకే అధికారులు దిగొచ్చేలా 72 గంటల పాటు వింత నిరసన చేపట్టినట్లు తెలిపారు.
తనకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ను కలిస్తే ఆర్టీవో కోర్టులో అప్పీల్ చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారని చెబుతున్నారు నాగేందర్ రెడ్డి. రికార్డులు అసలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తే ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదని తెలిపారు. దీనంతటికీ కారణమైన తహశీల్దార్ విజయ్ కుమార్, ఆర్ఐ లక్ష్మణ్, వీఆర్వో రాంబాబు మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినా కూడా న్యాయం జరగలేదని వాపోయారు. అందుకే వ్యవస్థ మీద నమ్మకం లేక చివరకు శాంతియుత నిరసనకు దిగినట్లు తెలిపారు. తన వ్యవసాయ భూమిలో గోతి తవ్వి మూడొంతులకు పైగా శరీరాన్ని అందులో పూడ్చి వింత నిరసన చేపట్టారు. భూమి కోసం జర్నలిస్ట్ ఆందోళనకు దిగారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
హై అలర్ట్.. దేశంలోకి టెర్రరిస్టులు..! రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
ఎమ్మార్వో హామీతో నిరసన విరమించిన నాగేందర్ రెడ్డి
జర్నలిస్ట్ నాగేందర్ రెడ్డి నిరసనతో అధికారులు దిగొచ్చారు. ఇన్నాళ్లుగా పరిష్కారానికి నోచుకోని తన భూమి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాగేందర్ రెడ్డి నిరసన చేపట్టారనే సమాచారంతో తహశీల్దార్ అక్కడకు చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. రెండు రోజుల్లో నివేదిక తయారుచేసి పై అధికారులకు పంపిస్తామన్న తహశీల్దార్ హామీతో చివరకు ఆయన నిరసన విరమించారు. దాంతో గోతిలో నుంచి ఆయన్ని బయటకు రప్పించారు.