ఖమ్మం గ్యాంగ్ రేప్: పోలీసుల చేతిలో అఖిల్, రేప్ వీడియోలూ స్వాధీనం
ఖమ్మం గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు అఖిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నుంచి బుధవారం ఉదయం అతను ఖమ్మం చేరుకున్నాడు. అతను తన ఇంటికి వెళ్లకుండా బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఖమ్మం: ఖమ్మం గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు అఖిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నుంచి బుధవారం ఉదయం అతను ఖమ్మం చేరుకున్నాడు. అతను తన ఇంటికి వెళ్లకుండా బంధువుల ఇంటికి వెళ్లాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకున్నారు.
అతడి వద్ద నుంచి సామూహిక అత్యాచారం వీడియోలు, ఫొటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఓ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు అఖిల్పై ఒత్తిడి తెచ్చింది. ఆమెను వదిలించుకోవాలనే కుట్రతో అఖిల్ ఈ నెల 1న ఆమెపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసి, వీడియోలు తీసిన విషయం తెలిసిందే.
వాటిని అడ్డుపెట్టుకుని మళ్లీ తమ కోర్కెలు తీర్చాలని, లేదంటే వీడియోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. యువతి ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో ప్రధాన నిందితుడైన అఖిల్ తిరుపతి పారిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందం తిరుపతి వెళ్లింది.
అయితే, బుధవారం అఖిల్ ఖమ్మం వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం బస్డిపో రోడ్డుకు చెందిన అఖిల్, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన ఉదయ్, ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్కు చెందిన కార్తీక్లపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, పోక్సో కేసులు నమోదుచేసినట్టు తెలిసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన రాధాకృష్ణపై వీటితో పాటు అదనంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.