మిస్సింగ్ చిన్నారి విజయవాడలో లభ్యం: చిన్నారి ఆచూకీ ఎలా దొరికింది అంటే?
ఖమ్మం ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన నవజాత శిశువు ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఐదు రోజుల తర్వాత శిశువు ఆచూకీ దొరికింది. శిశువు ని కిడ్నాప్ చేసిన మహిళకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు ఆ బిడ్డను కనుగొన్నారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి అపహరణ
ఖమ్మం ఆస్పత్రిలో 5 రోజుల క్రితం శిశువుకు పాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకు వెళ్లిన ఒక మహిళ ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆస్పత్రి వర్గాలు . ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన కిడ్నాపింగ్ ముఠా పని అని పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపింగ్ ముఠా పని అని నిర్ధారించిన పోలీసులు
ఈ కిడ్నాప్ ముఠా ప్రధానంగా ఏయే ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంది అని దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారిని గుర్తించారు. చికిత్స కోసం ఓ మహిళ చిన్నారిని విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. మహిళ చిన్నారిని తీసుకు వచ్చిన తీరు, ఆమె ఆ శిశువుకు తల్లి కాదని అర్థం చేసుకున్న డాక్టర్లు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు జరిపిన విచారణలో శిశువు ఖమ్మం ఆసుపత్రి నుండి కిడ్నాప్ చేసి తీసుకు వచ్చినట్లుగా తేటతెల్లమైంది.
విజయవాడలో కిడ్నాపింగ్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
దీంతో కిడ్నాప్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ ముఠాకు సంబంధించి కృష్ణా జిల్లా మైలవరంలో మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో చిన్నారి కిడ్నాప్ మిస్టరీ వీడింది. ఐదు రోజుల ఉత్కంఠకు తెరపడింది. తిరిగి తమ చిన్నారి తమ దగ్గరకు వస్తుందో లేదో అని విలపిస్తున్న తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు పోలీసులు. చిన్నారిని తీసుకు వచ్చిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
తల్లిదండ్రులకు అప్పగింత .. పిల్లల విషయంలో జాగ్రత్త అంటున్న పోలీసులు
చిన్నారి ఆచూకీ లభించడం, సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తన బిడ్డని తిరిగి తమకు క్షేమంగా తెచ్చి ఇవ్వడానికి ఎంతగానో కృషి చేసిన పోలీసులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు చెప్తూ, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ తమకు దక్కుతుందో లేదో, తిరిగి చూస్తామో లేదో అని ఆవేదన చెందిన తల్లిదండ్రులు ప్రస్తుతం చిన్నారిని ముద్దులాడు తున్నాడు. ఏదేమైనా చిన్నారుల కిడ్నాప్ ముఠాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఏమరుపాటుగా ఉండడం అంత మంచిది కాదని, కొత్త వ్యక్తులకు పిల్లలకు అప్పగించి పంపించ కూడదని పోలీసులు చెబుతున్నారు.