ఒత్తిళ్లకు లొంగవద్దని, బాబు భరోసా ఇచ్చారు: జంపింగ్పై టీ-టీడీపీ ఎమ్మెల్యే, కేసీఆర్ ప్లాన్
అమరావతి/ఖమ్మం: తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు. వారిద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే గెలిచారు. ఆ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. అయితే అది వట్టి ప్రచారమని అంటున్నారు.
జంపింగ్ వార్తల నేపథ్యంలో ఖమ్మం జిల్లా అశ్వారావుపేట టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు ఆదివారం అమరావతిలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు. పార్టీ మారుతున్నానని వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒత్తిళ్లకు లొంగవద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు
తన తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతానని మెచ్చా నాగేశ్వర రావు చెప్పారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని, పార్టీ మారాలంటూ వచ్చిన ఎటువంటి ఒత్తిడికైనా లొంగవద్దని చంద్రబాబు కూడా తనకు భరోసా ఇచ్చారని చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటానని, అమరావతికి కేవలం 150 కి.మీ. దూరంలో తమ స్వగ్రామం ఉందని, ఏ సందర్భంలోనైనా తనను నేరుగా వచ్చి కలవవచ్చని నైతిక ధైర్యం ఇచ్చారని చెప్పారు.
కొట్టి పారేస్తున్న నేతలు
తెలంగాణ ఎన్నికల్లో ఇద్దరు మాత్రమే టిడిపి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ ఇద్దరూ ఇంకా ప్రమాణ స్వీకారం సైతం చేయలేదు. దీనికి ముందే వారు టిడిపిని వీడి తెరాసలో చేరుతారని ప్రచారం జరగడం గమనార్హం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యేగా సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా గెలిచారు. ఇదిలా ఉండగా సండ్ర నియోజకవర్గంలోని పార్టీ నేతలతో దాదాపు రెండు గంటలకు పైగా మంతనాలు సాగించడం చర్చనీయాంశంగా మారింది. తెరాస నుంచి వచ్చిన ఆహ్వానం గురించి ముఖ్య నాయకులకు వివరించారని ప్రచారం సాగింది. పార్టీ మారుతారనే ప్రచారాన్ని అటు సండ్ర, ఇటు మెచ్చా కొట్టి పారేస్తున్నారు.
మండలి ప్లాన్ శాసన సభలోను
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి విజయఢంకా మోగించిన తెరాస ఇప్పుడు అసెంబ్లీలో మరింత పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెరాసలో చేరారు. మరికొందరు రాజీనామా చేసారు. మరోవైపు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పలువురు తెరాసలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు తెరాసను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పగా, ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పటికే మండలిలో కాంగ్రెస్ ముచ్చట ముగిసింది. శాసన సభలోనూ అదే వ్యూహానికి తెరాస పదును పెడుతోంది. ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా అసెంబ్లీలోనూ విలీన మంత్రం పఠిస్తోంది.
కాంగ్రెస్ విలవిల
అధికార పార్టీ సంధిస్తున్న ఈ విలీన అస్త్రాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ విలవిలలాడుతోంది. తెరాసలో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయకపోవడం, వారి సాయంతో కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేసుకోవడం, ప్రతిపక్ష హోదాను రద్దు చేయడం, తదితర అంశాలపై న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది.