ఖతర్నాక్ పాలిటిక్స్..... మామ టీఆర్ఎస్ .. అల్లుడు కాంగ్రెస్
ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో మామ అల్లుళ్ళ రాజకీయం పై పెద్ద చర్చ జరుగుతుంది. కేసీఆర్ , హరీష్ రావు అనుకునేరు .. కాదు ఎర్రబెల్లి , ఆయన అల్లుడు మదన్ మోహన్ రావు పైన రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఎందుకో తెలుసా ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి ఓ లుక్కెయ్యండి..
మామ టీఆర్ఎస్ కి జై అంటే అల్లుడు కాంగ్రెస్ లో సై అంటున్నాడు
ప్రస్తుత రాజకీయాల్లో ఒకే కుటుంబ సభ్యులైనా ఒకే పార్టీలో ఉండాలని లేదు. ఎవరి అనుకూలతని బట్టి, అవకాశాలను బట్టి వేర్వేరు పార్టీలు ఉండొచ్చు అని నేటి రాజకీయ పరిణామాలు చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీలో తొలిసారిగా మంత్రిగా అవకాశం దక్కించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీ పైన, అటు సీఎం కేసీఆర్ పైన విపరీతమైన అభిమానాన్ని చూపిస్తున్నారు. తాను ఏం చేసినా కెసిఆర్ రుణం తీర్చుకోలేనిది అని వేదికల మీద చెప్తున్నారు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?
ఎర్రబెల్లి తెలంగాణా రాష్ట్ర మంత్రి .. అల్లుడు మదన్ మోహన్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మామ తెలంగాణ రాష్ట్రసమితి నుంచి ఎన్నికై మంత్రి కాగా.. ఇప్పుడు ఆయన అల్లుడు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన 8మంది అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్న ఈ విచిత్రం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 19 స్థానాలను దక్కించుకుని మేము కూడా ఉన్నాము అని చెప్పుకోగలిగిన కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికలలో అయినా సత్తా చాటాలని భావిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17లోక్ సభ స్థానాలకు తాజాగా కాంగ్రెస్ అధిష్టానం 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో జహీరాబాద్ ఎంపీ స్థానానికి మదన్ మోహన్ రావును అభ్యర్థిగా ప్రకటించింది. మదన్ మోహన్ రావు స్వయానా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావుకు అల్లుడు .
కాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ బరిలో ఎర్రబెల్లి అల్లుడు .. తెలంగాణా రాజకీయాల్లో ఆసక్తికర అంశం
దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. మామ టిఆర్ఎస్, అల్లుడు కాంగ్రెస్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మదన్ మోహన్ రావు గతంలో ఇదే జహీరాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీఆర్ ఎస్ లో మామ ఎర్రబెల్లితోపాటు చేరారు. అయితే అనంతరం వివిధ కారణాల వల్ల మదన్ మోహన్ రావు బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మదన్ మోహన్ రావు ఐటీసెల్ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. తాజాగా వెలువడిన కాంగ్రెస్ జాబితాలో ఆయన జహీరాబాద్ ఎంపీ సీటును దక్కించుకున్నారు.ఇలా మామ టీఆర్ఎస్ లో మంత్రిగా ఉండడం... అల్లుడు ఆ పార్టీకి వ్యతిరేకమైన కాంగ్రెస్ లో ఎంపీగా పోటీచేస్తుండడం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకు కారణమవుతుంది.