అసలు నీకు పదవి ఎందుకు: కేసీఆర్పై కుష్బూ సంచలన ఆరోపణలు
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఓ నయా నవాబ్ అని కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ మంగళవారం మండిపడ్డారు. తిరిగే కార్లు, వందల కోట్ల బంగ్లాతో కేసీఆర్ నవాబ్ను తలపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదని, ఆయన సీఎం అంటే.. కమీషన్ మ్యాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో అధర్మ పాలన సాగిందని విమర్శించారు.
చంద్రబాబూ! నేను ప్రశ్నిస్తున్నా, నీలా ఢిల్లీలో తోక తిప్పుతానని చెప్పను: దులిపేసిన కేసీఆర్
ప్రతిపక్షం అంటే కేసీఆర్కు కనీసం గౌరవం లేదని ఖుష్బూ చెప్పారు. దేశంలోనే అవినీతిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, నిరుద్యోగంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఇదేనా కేసీఆర్ పాలన అన్నారు. మీకు నేను ఉన్నామని చెప్పేది కేవలం చేయి గుర్తు మాత్రమేనని, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
రూ.1 లక్ష ఉచితం
కాంగ్రెస్ గుర్తు హస్తమని, ఇది అందరికీ అండగా ఉంటుందని ఖుష్బూ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్వయంఉపాధి సంఘాలకు రూ.లక్ష ఉచితంగా ఇస్తామని, రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.ఐదు లక్షలు ఇస్తామన్నారు. రేషన్లో తొమ్మిది వంట సరుకులు అందిస్తామని చెప్పారు.
రూ.300 కోట్ల బంగ్లా కట్టుకున్న కేసీఆర్కు కారులేదట
రైతులకు మద్దతు ధర అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఖుష్బూ ఆరోపించారు. కేసీఆర్ కోసమే ఓవైసీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రూ.300 కోట్ల బంగ్లా కట్టుకున్న కేసీఆర్కు పాపం... సొంత కారు కూడా లేదట అని ఆశ్చర్యంతో కూడిన సెటైర్ వేశారు. ఆయన సచివాలయానికి రాకుండా ఫాంహౌస్లో ఉండే ముఖ్యమంత్రి అన్నారు. ఇలా ఫాంహౌస్కు పరిమితమైన ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరే అన్నారు.
కవిత మాత్రమే ఉన్నారు
ఒక్కరోజు సచివాలయానికి రాని కేసీఆర్, మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల మధ్య ఉంటానని చెప్పడం హాస్యాస్పదమని ఖుష్బూ అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కేసీఆర్కు లేదన్నారు. మహిళలకు సీట్లు కేటాయించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 11 మంది మహిళలకు సీట్లు ఇస్తే తెరాస కేవలం 4 సిట్లు ఇచ్చిందని, ఒక్కరికి కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇవ్వలేదన్నారు. 14 మంది ఎంపీల్లో ఒకేక ఒక మహిళా ఎంపీ అని, ఆమె కూడా కేసీఆర్ కూతురు కవిత అన్నారు.
కేసీఆర్ పెద్ద జీరో, ఆయనకు పదవి ఎందుకు
కేసీఆర్ పెద్ద జీరో అని, ఆయనకు పదవి ఎందుకని ఖుష్బూ ప్రశ్నించారు. అప్పులిచ్చే స్థితి నుంచి అప్పులు చెల్లించాల్సిన స్థితికి తెలంగాణను తెచ్చారని చెప్పారు. కేబినెట్లో మహిళలకు స్థానం ఇవ్వలేదన్నారు. కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ తిరిగి సీఎం కావాలనుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను పేరు మార్చి తమ పథకాలుగా తెరాస ప్రచారం చేస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మిని అభిమానులకే పరిమితం చేశారన్నారు.