చిన్నారి ప్రాణం తీసిన విక్స్డబ్బా: గొంతులో ఇరుక్కొని మృతి
హైదరాబాద్: విక్స్డబ్బా ఓ చిన్నారి ప్రాణం తీసింది. సరదాగా ఆడుకుంటూ విక్స్డబ్బాను నోట్లో పెట్టుకోగా మృత్యువులా మారింది. కళ్ల ముందే తమ కూతురు ఊపిరి ఆగుతుండడం చూసి చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన కారగిరి గణేశ్, వనజ దంపతుల మొదటి సంతానం సాయికృతిక్ష (14 నెలలు). మంగళవారం రాత్రి భోజనం చేశాక తల్లి వనజ చిన్నారి ఎదుట కొన్ని ఆట వస్తువులను ఉంచి పనిలో నిమగ్నమైంది. మంచంపై ఆటాడుకుంటున్న ఆ చిన్నారి అక్కడే ఉన్న విక్స్ డబ్బా కనిపించగా, చిన్నారి తీసుకుని నోట్లో పెట్టుకుంది.
దీంతో అది గొంతుకు అడ్డుపడి ఊపిరాడక పోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని ఎదురుగా చూస్తూనే ఉన్న చిన్నారి తల్లిదండ్రులు గొంతులో ఇరుక్కుపోయిన డబ్బాను తీసేందుకు యత్నించారు. ఎంతకీ అది రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారాన్ని తెలిపి చికిత్స నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు.
తొమ్మిది గంటలకు భైంసా ఆస్పత్రికి చేరుకోగానే చిన్నారిని పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, చిన్నారి తల్లి వనజ తానూరు కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలుగా పనిచేస్తోంది. గణేశ్ పీజీ పూర్తి చేసి గ్రూప్స్ కోసం సిద్ధమవుతున్నాడు.
‘చేతిలో ఆడుకోవడానికి తీసుకున్న విక్స్డబ్బా పాప పాలిట మృత్యువుగా మారుతుం దని ఊహించలేకపోయాం, రోజూ ఇంటికి రాగానే వచ్చీరాని మాటలతో పాప ఎదురు వచ్చేది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పిలుస్తారు?' అంటూ ఆ తల్లిదండ్రులు కంటతడి పెట్టడం అందరినీ కదిలించింది. బుధవారం ఉదయం మహాగాంలో పాప అంత్యక్రియలు నిర్వహించారు.