లేబర్ ఆఫీసర్ కిడ్నాప్ విషాదాంతం: దారుణహత్య, అటవీ ప్రాంతంలో మృతదేహం., నిందితుడు టీఆర్ఎస్ నేత?
ఖమ్మం/భూపాలపల్లి: ఖమ్మంలో కిడ్నాపైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆనంద్ రెడ్డి అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన కుటుంబసభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాలుగు బృందాలుగా గాలింపు చేపట్టారు.
భూపాలపల్లి అటవీ ప్రాంతంలో..
కాగా, భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో ఆనంద్ రెడ్డి ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయాయి. దీంతో ఆనంద్ను హత్య చేసి అక్కడే అటవీ ప్రాంతంలో పడేసినట్లు తెలుస్తోంది. ఆనంద్ రెడ్డిని తీసుకెళ్లిన ప్రదీప్ రెడ్డి అనే కమలాపూర్ టీఆర్ఎస్ నేత హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.
పోలీసుల అదుపులో..
ప్రస్తుతం ప్రదీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అతనితోపాటు మరో ముగ్గురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆనంద్ రెడ్డి హత్య వెనుక భూ వివాదం, ఇసుక మాఫియా ఉన్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం కిడ్నాప్..
మార్చి 7న ఆనంద్ రెడ్డి.. తనకు పరిచయం ఉన్న ప్రదీప్ రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. అప్పట్నుంచి ఆయన ఇంటికి రాలేదు. ఈ క్రమంలో ఆనంద్ రెడ్డి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కాగా, భూపాలపల్లి జిల్లా రాంపూర్ అటవీ ప్రాంతంలో ఆనంద్ రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.
హైదరాబాద్లో ప్రదీప్ రెడ్డి కారు.. వాష్ చేసి..
కాగా, ప్రదీప్ రెడ్డి.. సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి సోదరుడని తెలిసింది. ఇది ఇలావుండగా, ఆనంద్ రెడ్డిని కారులో తీసుకెళ్లిన ప్రదీప్ రెడ్డి.. ఆ కారును హైదరాబాద్లోని అల్వాల్లో ఓ స్నేహితుడి ఇంటి వద్ద పార్క్ చేసినట్లు తెలిసింది. అంతకుముందే ఆ కారును వాష్ చేసినట్లు సమాచారం.