నాలుగేళ్ల క్రితం యువతి అదృశ్యం: రూ.5 లక్షలు ఇస్తే విడుదల చేస్తామని షరతు
హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఓ యువతి కేసు విచిత్రమైన మలుపు తీసుకుంది.రూ.5 లక్షలిస్తే మీ కూతుర్ని వదిలేస్తామని, లేదంటే చంపేస్తామని ఆ యువతి తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కమలానగర్లో నివసించే నాగేశ్వర్ కుమార్తె కృష్ణమానస(23) 2011లో కనిపించకుండా పోయింది. అప్పట్లో పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఆమె ఆచూకీ లభించలేదు. ప్రతి చోటా గాలించినా ఫలితం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారు. అయితే, ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ కూతుర్ని కిడ్నాప్ చేశామని, డబ్బులిస్తే వదిలేస్తామని బెదిరించాడు.
నమ్మకం కుదరని కుటుంబ సభ్యులు తమ కూతురితో మాట్లాడించాలన్నారు. దీంతో మాట మార్చిన అగంతకుడు మీ అమ్మాయి ఆస్పత్రిలో ఉందని, బిల్లు కట్టేందుకు డబ్బులు కావాలన్నాడు. తిరిగి, మంగళవారం ఫోన్ చేసి డబ్బులివ్వకుంటే యువతిని చంపేస్తామని ఘాటుగా హెచ్చరించాడు.
ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెంబర్ను కూడా మెసేజ్ చేశాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు అగంతకుడి ఫోన్ నెంబర్ తప్పుడు అడ్రస్తో ఉన్నట్లు గుర్తించారు. కూతురు కనిపించలేదన్న వేదనలో ఉన్నవారి పరిస్థితి తెలిసి డబ్బుల కోసం అగంతకుడు ప్లాన్ వేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు సీఐ పుష్పన్కుమార్ తెలిపారు.