మద్యం వల్ల మరో ఘోరం : యువకుడి కిడ్నీ డ్యామేజ్
హైదరాబాద్ : 'మద్యం సేవించడం.. అటుపై రోడ్ల మీదికెక్కి.. వాహానాలతో రయ్యిమంటూ దూసుకుపోవడం.. ఈ క్రమంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం..' గత కొన్నిరోజులుగా హైదరాబాద్ కు సంబంధించి వార్తల్లోకి ఎక్కుతోన్న అంశాలివి. ఇప్పటికే రమ్య, సంజన (బ్రెయిన్ డెడ్) లాంటి ఇద్దరు చిన్నారులు తాగుబోతుల వీరంగానికి బలైపోగా.. తాజాగా మరో యువకుడు మద్యం కారణంగా ప్రమాదానికి గురయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆర్కేపురం నివాసి అయిన వంశీ (18) తన పుట్టినరోజు సందర్బంగా.. ఈ నెల 10న తన స్నేహితులందరికీ నెక్లెస్ రోడ్డులో పార్టీ ఇచ్చాడు. కేక్ కట్ చేసిన అనంతరం స్నేహితులంతా కలిసి మద్యం సేవించారు. అనంతరం అక్కడి నుంచి బైక్స్ పై కేబీఆర్ వద్దకు బయలుదేరిన సమయంలో.. వెనుక సీట్లో కూర్చొన్న రేవంత్ అనే యువకుడు పట్టు తప్పి బైక్ నుంచి కిందపడిపోయాడు. ఆ సమయంలో మితిమీరిన వేగంతో వారంతా బైక్స్ డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో హుటాహుటిన అతన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో అతని కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో కిడ్నీని తొలగించేశారు వైద్యులు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మైనర్లకు మద్యం సరఫరా చేసిన వైన్స్ షాపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితుడి తండ్రి సుభాఫ్ చంద్రబోస్. కాగా, మైనర్లు బైక్ రేసింగ్ కు పాల్పడినందువల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.