కిడ్నీలు తీసిన బంటు: 60 కిడ్నీలు, రూ. 3 కోట్లు
నల్లగొండ: కిడ్నీ రాకెట్లో ప్రధాన ఏజెంట్ సురేష్ ప్రజాపతి అహ్మదాబాద్లో స్థానిక ఆసుపత్రులతో, డయాగ్నాస్టిక్ సెంటర్లతో సంబంధాలు పెట్టుకుని కిడ్నీ మార్పిడి, విక్రయాల దందా నిర్వహిస్తు ఇప్పటిదాకా 60 మంది కిడ్నీలను విక్రయించడం ద్వారా 3కోట్లకు పైగా సంపాదించినట్లు నల్లగొండ జిల్లా పోలీసులు గుర్తించారు.
పోలీసులకు చిక్కిన ప్రధాన ఏజెంట్ సురేష్ ప్రజాపతి ఇంటర్నెట్లో కిడ్నీ ఇస్తామంటూ వెబ్సైట్స్ ఏర్పాటు చేసుకుని 2012నుండి కిడ్నీ విక్రయాల దందాను కొనసాగిస్తున్నాడు. సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన ఏజెంట్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిడ్నీ రాకెట్ ఏజెంట్లను హాజరుపరిచి కేసు పురోగతి వివరాలను వెల్లడించారు.
ఇప్పటికే అరెస్టయిన నల్లగొండకు చెందిన కసుపరాజు సురేష్ వెల్లడించిన సమాచారం మేరకు పోలీసు బృందాలు గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన ప్రధాన ఏజెంట్ సురేష్బాయ్ ప్రజాపతి, అతని అనుచరుడు దిలీప్ ఉమేద్మాల్ చౌహాన్లతో పాటు హైద్రాబాద్ గచ్చిబౌలి ఈల్లా హోటల్లో పనిచేస్తున్న జెను నూకరాజులను అరెస్టు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో ఇద్దరు ఏజెంట్లతో పాటు ఎనిమిది మంది కిడ్నీ విక్రయదారులను అరెస్టు చేశామన్నారు. నూకరాజు తన కిడ్నీని అమ్ముకోవడంతో పాటు సురేష్ ప్రజాపతికి సహాయ ఏజెంట్గా పనిచేస్తున్నాడని తెలిపారు. కొలంబోలోని నవలోక్, హేమా, లంకన్, వెస్టర్న్ ఆసుపత్రుల్లో కిడ్నీల విక్రయం, మార్పిడి ఆపరేషన్లను జరిపించాడు.
ఒక్కో కిడ్నీ గ్రహీత నుండి 28నుండి 30లక్షల మేరకు తీసుకునేవాడు. నిందితుల అక్రమ ఆస్తులను గుర్తిస్తామని, వాటిని జప్తు చేయిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే వారిని కోర్టుకు రిమాండ్ చేయడంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర నిందితుల అరెస్టుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
కిడ్నీ రాకెట్ కేసులో చట్ట వ్యతిరేకంగా తమ కిడ్నీలు విక్రయించిన వారితో పాటు కిడ్నీలు పొందిన వారిపైన, అక్రమ కిడ్నీ మార్పిడికి సహకరించిన అహ్మదాబాద్, కొలంబో ఆసుపత్రులపైనా, వైద్యులపైనా కూడా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ ప్రకటించారు.
కిడ్నీలు విక్రయించిన 60మందిలో 55మంది పేర్లు, కిడ్నీ గ్రహీతల్లో సైతం 55మంది పేర్లు ప్రజాపతి చెప్పాడన్నారు. కిడ్నీ గ్రహీతల్లో ఏపి, తెలంగాణల నుండి 22మంది, తమిళనాడు నుండి ఆరుగురు, మహారాష్ట్ర నుండి ఐదుగురు, ఢిల్లీ నుండి ముగ్గురు, కర్నాటక నుండి నలుగురు, కేరళ తదితర రాష్ట్రాల నుండి 12మంది ఉన్నారని దుగ్గల్ వెల్లడించారు.