అక్కాచెల్లెళ్ళ హత్య: అమిత్ తెలుగు పత్రికలు చదివాడు, కళ్లు గప్పాడు
హైదరాబాద్: హైదరాబాదులోని చైతన్యపురిలో అక్కాచెల్లెళ్లను హత్య చేసిన అమిత్ సింగ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అతని కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. గత పది రోజులుగా అతన్ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీలేఖను, ఆమె అక్క యామినీ సరస్వతిని హత్య చేసిన తర్వాత అమిత్ సింగ్ ఎల్బీ నగర్ ప్రాంతంలో సంచరించినట్లు తెలుస్తోంది. అతని చివరి ఫోన్ లోకేషన్ ఎల్బీ నగర్లోనమోదైంది.
హత్య చేసిన అమిత్ సింగ్ పారిపోయిన వెంటనే పోలీసులు అమిత్ సింగ్ చదివాడని చెబుతున్న నారాయణగుడా, ఇబ్రహీంపట్నం కాలేజీలకు వెళ్లి స్నేహితుల వద్ద ఆరా తీశారు. అయితే, అతను ఆ కాలేజీల్లో చదవడం లేదని పోలీసులు తేల్చుకున్నారు. ఆ తర్వాత స్వస్థలం షాద్ నగర్ వెళ్లారు. అమిత్ సింగ్ కుటుంబ సభ్యుల ఇంటికి తాళం వేసి ఉంది. కుటుంబ సభ్యులను పట్టుకోవడంలో పోలీసులు మునిగిపోయిన సమయంలో అమిత్ సింగ్ జులై 14వ తేదీన నేరుగా సికింద్రాబాద్ వెళ్లి ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత బుధవారంనాడు అమిత్ సింగ్ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్కు చేరుకుని అమిత్ను పట్టుకోవడానికి పోలీసులకు సహకరించేందుకు సిద్ధపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చేరుకున్న తర్వాత అమిత్ సింగ్ అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడే ఉండాలని, తాను వస్తున్నానని తండ్రి అమర్ సింగ్ అమిత్ సింగ్కు చెప్పాడు.
ఈలోగా అమిత్ సింగ్ మథురలోని తన బంధువులను కలుసుకుని తన పరిస్థితిని వివరించి డబ్బులు తీసుకున్నాడని అంటున్నారు. అక్కడ తెలుగు దినపత్రికలు కొనుక్కుని కేసుకు సంబంధించిన వివరాలను చదివి, పరిస్థితిని అర్థం చేసుకుని, తన కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్కు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి చెక్కేశాడని అంటున్నారు.
దాంతో పోలీసులు మథుర చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. పాత సిమ్ కార్డును, ఫోన్ను అమిత్ సింగ్ పారేశాడని అంటున్నారు. కొద్ది మంది కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అమిత్ కొత్త సిమ్ కార్డు, కొత్త ఫోన్ వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో అమిత్ సింగ్ అక్క ఉంటుంది. ఆమె వద్దకు కూడా అమిత్ సింగ్ వెళ్లినట్లు లేదని అంటున్నారు.
గత 24 గంటలుగా అతను ఫోన్ వాడడం కూడా మానేశాడు. అయితే, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.