రూ. 60 లక్షలు మోసం: కిల్లీ కృపారాణి మాజీ పిఎ అరెస్టు
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కిల్లి కృపారాణి వద్ద పిఎగా పనిచేసిన ఓ వ్యక్తి వ్యాపారిని రూ.60 లక్షల మేరకు మోసం చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఓ వ్యాపారిని రూ.60 లక్షల మేరకు మోసం చేసిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మాజీ పిఎ తమ్మినేని సత్యనారాయణను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ పోర్టులో సభ్యత్వం ఇప్పిస్తానని చెప్పి ఆ మొత్తానికి అతను మోసం చేశాడు.
హైదరాబాదులో ఎంఎంసిసి కాలేజీ కలిగి ఉన్న అతను ఎంసిఎ గ్రాడ్యుయేట్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి సభ్యత్వం మంజూరైనట్లు అతను ఓ ఆర్డర్ కూడా ఇచ్చాడు. ఒడిశాకు చెందిన సత్యనారాయణ తన సోదరుడితో కలిసి 2003 నుంచి హైదరాబాదులో స్కూల్ నడుపుతన్నాడు.
పరిచయం పెంచుకున్ని కిల్లి కృపారాణి వద్ద అతను పిఎగా చేరాడు. ఆమె వద్ద పిఎగా పనిచేస్తున్న కాలంలో అతను ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండేవాడు. మంత్రి పేరు చెప్పుకుని సంబంధాలు పెంచుకున్నాడు. ఆ సంబంధాలతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తూ వచ్చాడు.
అతను ఎప్పుడో గాని హైదరాబాదు వచ్చేవాడు కాడు. మోసం చేసినవారు పట్టుకుంటారనే భయంతో చాటుమాటుగా వచ్చేవాడు. సినిమాలకు ఫైన్సాన్స్ చేయడంతో పాటు ట్రావెల్ ఏజెన్సీ నడిపే జి. రమేష్ను అతను మోసం చేశాడు. విశాఖ పోర్టులో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని రమేష్కు అతను హామీ ఇచ్చాడు.
దాంతో అతను అడిగిన రూ.60 లక్షల మొత్తాని రమేష్ ఇచ్చేశాడు. ఆ తర్వాత నితిన్ గడ్కరీ సంతకంతో సత్యనారాయణ రమేష్కు ఓ ఆర్డర్ కాపీ ఇచ్చాడు. అయితే, ఆ ఆర్డర్ నకిలీదనీ సంతకం, స్టాంపులు ఫోర్జరీ చేసినట్లు రమేష్ గుర్తించారు.
కిల్లి కృపారాణి వద్ద అతను రెండు నెలలు మాత్రమే పిఎగా పనిచేశాడని, అతని చిల్లర పనులు తన దృష్టికి రావడంతో ఆమె అతన్ని డిస్మిస్ చేశారని పోలీసు కమిషనర్ భగవత్ చెప్పారు. దాదాపు పది మందిని అతను మోసం చేసినట్లు తెలిపారు.