చారిత్రక కింగ్కోఠి ప్యాలెస్ అమ్ముడుపోయింది: ఎంతకు? ఎవరికో తెలుసా?
హైదరాబాద్: అలనాటి చరిత్ర వైభవానికి నిదర్శనంగా ఉన్నటువంటి, నిజాం వారసత్వ ఆస్తుల్లో ఒకటైన కింగ్ కోఠి ప్యాలెస్ను ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. సుమారు 70ఏళ్లుగా నిజాం వారసుల ఆధీనంలో ఉన్న ఈ ప్యాలెస్ను ఐరిస్ అనే హోటల్స్ సంస్థకు రూ. 300 కోట్ల ఒప్పందంతో నిజాం ట్రస్ట్ నుంచి కొనుగోలు చేసిన మరో సంస్థ విక్రయించింది.
నిజాం డబ్బుకు 120 మంది వారసులు, రూ. 300 కోట్లు పంపకం
పరదా గేట్ అలా..
నజ్రీబాగ్(పరదా గేట్)గా వ్యవహరించే ఈ కట్టడాన్ని కూల్చివేసి భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిసింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్యాలెస్ లో నివాసం ఉండేవారు. ప్యాలెస్కు ఎప్పుడూ పరదా వేసి ఉండటం వల్లే దీనికి పరదాగేట్ అన్న పేరు వచ్చింది. ఇప్పటికి కూడా ఆ పరదా అలాగే ఉండటం విశేషం.
భారీ ధరకు..
ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తి నివాసంగా వెలుగొందిన 5వేల గజాల విస్తీర్ణంలో ఉన్న భారీ భవంతి నజ్రీభాగ్కు చాలా కాలం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా జీపీఏ హోల్టర్ వ్యవహరించారు. ఎస్ట్రా నుంచి ముంబైకి చెందిన నివాహారిక కన్స్ట్రక్షన్స్ కంపెనీ కొనుగోలు చేయగా.. తాజాగా నిహారిక కన్స్ట్రక్షన్స్ నుంచి ఐరిస్ హోటల్స్ సంస్థ రూ. 300 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఆ కాలంలో అలా..
కింగ్కోఠి ప్యాలెస్లోని ప్రధాన భవనం నజ్రీబాగ్.. అప్పట్లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నివాస కేంద్రంగా కొనసాగింది. ఈ భవంతిలో ఆయన ఉంటేనే పరదాని పైకి లేపి ఉంచేవారు. పరదా కిందికి వేసి ఉంటే ఆయన రాజ్య పర్యటనలో ఉన్నారన్న మాట. నిజాం రాజు నిత్యం వెళ్లా దారిని నీళ్లతో కడిగిశుద్ధి చేసేవారు. సాయుధ పోలీస్ బలగాలతో భారీ పహారా ఉండేది.
ఎన్నో ప్రత్యేకతలు.. కూల్చివేత తప్పేలా లేదు..
కమల్ఖాన్ ఆధ్వర్యంలో మొఘల్, యూరోపియన్ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో కింగ్ కోఠి ప్యాలెస్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ భవన నిర్మాణ శైలిని చూసేందుకు అనేక దేశాల అర్కిటెక్టులు వచ్చి పరిశీలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేగాక, ఈ భవనం చాలాకాలం హెరిటేజ్ జాబితాలో కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో హెరిటేజ్ భవనాల జాబితా ఏదీ అధికారికంగా లేకపోవడంతో ఈ భవనాన్ని ఐరిస్ హోటల్స్ కూల్చివేసే అవకాశమే కనిపిస్తోంది.
వివాదం ఉన్నప్పటికీ..
ఇది ఇలావుంటే, నిజాం ట్రస్ట్ నుంచి ఈ భవనాన్ని తొలుత నిహారిక ఇన్ఫ్రా కంపెనీ కొనుగోలు చేయగా.. ఇదే కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఐరిస్ హోటల్స్ సంస్థకు విక్రయించారు. ఈ విషయమై నిహారిక మిగితా డైరెక్టర్లు వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకుండా చూడాలని కోరారు. హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్కు కూడా ఓ లేఖను రాశారు. అయితే, తాము అన్ని పరిశీలించాకే రిజిస్టర్ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రసాద్ ఓ మీడియా సంస్థతో చెప్పడం గమనార్హం.
చారిత్రక ప్యాలెస్ కూల్చివేత అడ్డుకుంటారా?
కింగ్ కోఠి ప్యాలెస్లో మొత్తం మూడు భవనాలున్నాయి. ఒక భవనం ఈఎన్టీ ఆస్పత్రి కొనసాగుతుండగా, మరోదాంట్లో నిజాం ట్రస్ట్ కొనసాగుతున్నాయి. అప్పట్లో మొఘల్, యూరోపియన్ వాస్తు నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. అయితే, నిజా పతనం తర్వాత భవనం పట్ల సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. చారిత్రక కట్టడమైన కింగ్కోఠి ప్యాలెస్ కూల్చివేతను అడ్డుకుంటామని పలువురు తెలంగాణవాదులు పేర్కొంటున్నారు.