కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణాకు తొలిసారిగా కిషన్ రెడ్డి రాక .. ఘనంగా స్వాగతం పలుకనున్న బీజేపీ
బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడినా ఎంపీగా గెలిచి మోడీ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మంత్రి అయిన తరువాత తొలిసారి కిషన్ రెడ్డి తెలంగాణాకు రానున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది బీజేపీ .
తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ గా జనసేన అభ్యర్థి విజయం .. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే
తెలంగాణా ప్రాంత నాయకుడికి కేంద్ర మంత్రి హోదా... తెలంగాణా పార్టీ శ్రేణుల్లో సంబరాలు
ముప్పై ఏళ్ళుగా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రియ శిష్యుల్లో ఆయన ఒకరు. జాతీయ నాయకులతో సత్సంబంధాలు నెరపగల నాయకుడు. ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద కష్టపడి పనిచేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అగ్ర నేతలకు చేరువైన ఆయన, ఆ తర్వాత ఆ సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభాపక్ష నేతగా చురుకైన పాత్ర పోషించారు. అలాంటి కిషన్ రెడ్డికి తెలంగాణా ప్రాంత నాయకుడికి కేంద్ర మంత్రి హోదా ఇచ్చి గౌరవించింది బీజేపీ అధిష్టానం . దీంతో తెలంగాణా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి తెలంగాణాకు రానున్న కిషన్ రెడ్డి ... భారీ ర్యాలీ.. ఘన సన్మానం
కేంద్రమంత్రిగా ఎన్నికైన అనంతరం తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి నేడు తొలిసారిగా స్వరాష్ట్రానికి రానున్న నేపధ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. గత నెల 30 కేంద్రమంత్రి మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డిని ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న కిషన్ రెడ్డి... నేడు స్వరాష్ట్రమైన తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కిషన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణకు రానుండటంతో... ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ప్లాన్ లో ఉన్న బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించాలని భావిస్తుంది. బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
బిజీబిజీగా కిషన్ రెడ్డి షెడ్యూల్ ... ప్రధానితో పాటు ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న కిషన్ రెడ్డి
ఇక కేంద్రమంత్రిగా స్వరాష్ట్రానికి రానున్న కిషన్ రెడ్డి షెడ్యూల్ గమనిస్తే ఆదివారం కిషన్ రెడ్డి తన స్వగ్రామం అయిన తిమ్మాపూర్ కు వెళ్లి ఇటీవల స్వర్గస్థులైన తల్లి సమాధి వద్ద నివాళులు అర్పించి ఆ తర్వాత తిరుమలకు వెళతారు . తిరుమలలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు శ్రీ వారిని దర్శించుకుని ఆయనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సోమవారం హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు కిషన్ రెడ్డి .అంబర్ పేట, సనత్ నగర్ ఏరియాల్లో పాదయాత్ర నిర్వహిస్తారు. తెలంగాణా పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత జీహెచ్ ఎంసీ అధికారులతో, మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ మరియు మురుగు నీటి పారుదలా మండలితో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇలా నాలుగు రోజుల పాటు స్వరాష్ట్రంలో సాగనున్న పర్యటన లో బిజిబిజీగా గడపనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత మంగళవారం నాడు తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.