గ్రేటర్ ఎన్నికలు : బీజేపీ గెలుస్తుందన్న భయంతోనే అల్లర్లు... టీఆర్ఎస్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీ గెలుస్తుందన్న భయంతోనే టీఆర్ఎస్ నేతలు అల్లర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అనైతిక విలువలను పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు.
Recommended Video
రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్దిని చూపించి ఆ పార్టీ ఓట్లు అడగాలన్నారు. ఓట్ల కోసం నోట్లు,మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టడం సరికాదన్నారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి ఊడిగం చేయకూడదని హెచ్చరించారు. నిబద్దతతో పనిచేస్తున్న అధికారులను అధికార పార్టీ నేతలు బదిలీ చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అవినీతి పట్ల గ్రామ గ్రామాన ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. తెలంగాణ సమాజం ఎవరికీ లొంగదని,నిర్భంధాలను ఇక్కడి ప్రజలు సహించరని పేర్కొన్నారు.
అంతకుముందు,మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి... గ్రేటర్ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని,బీజేపీకి పూర్తి మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ పెరిగితే అది బీజేపీకే లాభమన్నారు. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని,ధర్మాన్ని,ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా,గ్రేటర్ ఎన్నికల పోలింగ్కి మరికొద్ది గంటల సమయమే ఉన్న తరుణంలో హైదరాబాద్ నడిబొడ్డున పీపుల్స్ ప్లాజా సమీపంలో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతకు తెరలేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సోమవారం(నవంబర్ 30) సాయంత్రం నగరంలోని పీపుల్స్ ప్లాజాకు వెళ్లారు. అక్కడినుంచి లేక్ వ్యూ పోలీస్ అవుట్ పోస్టు సమీపంలోని ఓ హోటల్కు వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పోరేటర్ విజయారెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. తన డివిజన్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు సంజయ్ అక్కడికి వచ్చారని... నగదు పంపిణీకి ప్రయత్నిస్తున్నారని విజయారెడ్డి ఆరోపించారు.
ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని బండి సంజయ్ను ఆయన వ్యక్తిగత వాహనంలో అక్కడినుంచి పంపించారు. అయితే సంజయ్ వెంట వచ్చిన బీజేపీ వాహనాలను తనిఖీ చేయాలని విజయారెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సంజయ్కు పార్టీ కేటాయించిన వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులతో దాడి చేశారని తెలుస్తోంది. ఈ దాడిలో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఎట్టకేలకు పోలీసులు ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించి ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేశారు.