మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: కిషన్ రెడ్డి
భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని తెలిసినప్పటికీ సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి శాసనసభా పక్ష నేత జి.కిషన్రెడ్డి విమర్శించారు.
వరంగల్: భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని తెలిసినప్పటికీ సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి శాసనసభా పక్ష నేత జి.కిషన్రెడ్డి విమర్శించారు. హంటర్రోడ్డులోని వేద బంకెట్హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో వైయస్ ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించగా హైకోర్టు కొట్టివేసిందన్నారు. దీనిని మరిచిపోయి కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు అంటూ ముస్లింలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో భాజపా అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ, రూరల్ అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, చందుపట్ల సత్యపాల్రెడ్డి, చింత సాంబమూర్తి, అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలను సంతోష్రెడ్డి, జగదీశ్వర్, నాయకులు దిలీప్నాయక్, కుమార్, జన్ను మధు, భవాని, రవళి తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట రైల్వే కోర్టుకు హాజరు..
రైలురోకో కేసులో కాజీపేటలోని రైల్వే కోర్టుకు గురువారం భాజపా శాసనసభా పక్ష నేత జి.కిషన్రెడ్డి హాజరయ్యారు. 2012లో భువనగిరిలో జరిగిన రైలురోకోలో పాల్గొన్న ఘటనపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారని కిషన్రెడ్డి తెలిపారు. కోర్టుల చుట్టు ప్రదక్షిణలు చేస్తూ చెప్పులరిగేలా తిరుగుతున్న ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
కోర్టుకు హాజరైన వారిలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి, కిసాన్మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి, మనోహర్రెడ్డి, అమరేందర్, కృష్ణ, శ్రీనివాస్, మేర్గు మధు ఉన్నారు. అంతకుముందు రాజధాని ఎక్స్ప్రెస్లో కాజీపేట రైల్వేస్టేషన్కు వచ్చిన కిషన్రెడ్డికి పార్టీ అర్బన్, రూరల్ జిల్లా నేతలు స్వాగతం పలికారు.