దుబ్బాక ఉపఎన్నిక.. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం : కిషన్ రెడ్డి ఏమన్నారంటే
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ఉప ఎన్నిక ప్రచారాన్ని కొనసాగిస్తూనే, ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈసారి ఈ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీతో పాటుగా, బిజెపి కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా దుబ్బాక ఎన్నికలలో సత్తా చాటాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
దుబ్బాక ఉపఎన్నిక హీట్ .. బస్టాండ్కు రమ్మన్న బండి సంజయ్ పత్తాలేడన్న హరీష్ రావు
దుబ్బాక ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన బండి సంజయ్
బీజేపీ నుండి రఘునందన్ రావు బరిలోకి దిగారు. ఇప్పటికి రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు పై ఈసారి ప్రజలు సానుకూలంగా ఉన్నారు అన్న భావనలో బిజెపి అగ్రనాయకులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి కూడా ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ బాధ్యత తీసుకున్న తర్వాత జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని బండి సంజయ్ తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు.
పవన్ ను కలిసిన బండి సంజయ్ ... దుబ్బాక ప్రచారానికి రావాలని
దుబ్బాక ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రావాలని కోరినట్లుగా తెలుస్తుంది. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తే యూత్ ఓటర్లను ఆకర్షించవచ్చు అన్నది బిజెపి ఆలోచనగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారా లేదా అన్న అంశంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
పవన్ ప్రచారంపై ఇంకా క్లారిటీ లేదన్న కిషన్ రెడ్డి
దుబ్బాక ఎన్నికల ప్రచారం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు. మంత్రి హరీష్ రావు క్షణం కూడా తీరిక లేకుండా తెగ ప్రచారం చేస్తున్నారని, ప్రచారంలో ఆయన ప్రస్టేషన్ అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని చెప్పిన కిషన్ రెడ్డి, దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంపై కూడా ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
దుబ్బాకలో పవన్ దుమ్ము లేపుతారా .. లేదా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి జనసేన పార్టీ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నారు. ఒకవేళ పవన్ దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి రావడానికి ఆసక్తి చూపిస్తే కచ్చితంగా దుబ్బాకలో పవన్ దుమ్ము లేపుతారనేది ఒక టాక్ .