దేశ హితం కోసమే.. ఓట్ల కోసం కాదు: కేసీఆర్ను నియంత అంటూ ఏకేసిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలు, విమర్శలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి అలాంటి భాష ఉపయోగిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ హితం కోసమే.. ఓట్ల కోసం కాదు..
సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం-ఒకే గ్రిడ్ విధానం అమలు కావాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదని కేసీఆర్ కు హితవు పలికారు. దేశ హితం కోసం కేంద్రం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
నియంతలా వ్యవహరిస్తూ..
గత విధానాల్లో మార్పుల కోసమే అనేక సంస్కరణలు చేపట్టామని కిషన్ తెలిపారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే మరో 70ఏళ్లైనా దేశం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్రం ప్రకటించిన రూ. 21 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నియంతృత్వ పాలన సాగిస్తూ.. తమ పార్టీ తప్ప ఎవరూ ఉండకూడదనే సంకుచిత దోరణిలో కేసీఆర్ ఉన్నారని ధ్వజమెత్తారు.
మీరు చేస్తే రైట్.. మేం చేస్తే తప్పా?
తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు పథకం వర్తించదని కేసీఆర్ చెబుతున్నారు.. ఇలా ఎందుకు చేస్తున్నట్లు? అని తాము ప్రశ్నించలేదు. ఎందుకంటే సంస్కరణలు, గిట్టుబాటు ధరల కోసం అలా చేశారేమో అని. అదే పని కేంద్రం చేస్తే మాత్రం ఎందుకు సరికాదంటున్నారని కేసీఆర్ను ప్రశ్నించారు. రెండు నాల్కల దోరణి అవలంభిస్తున్నారంటూ కిషన్ మండిపడ్డారు.
అలాంటి ప్యాకేజీని బోగస్ అంటారా?
తెలంగాణ నుంచి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారు. 40ఏళ్ల నుంచి ఉన్న ఈ సమస్యకు పరిష్కారం వద్దా? పాలనా సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు రాకపోతే ఎలా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ ప్రధానిని విమర్శించుకోవడం మంచిదా? అని నిలదీశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా తెలంగాణలో ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు రావా? ముద్ర రుణాల ద్వారా చిన్న వ్యాపారులకు రుణాలు లభించవా? అని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్యాకేజీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ బోగస్ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం పనిచేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.