అధ్యక్షా..: కిషన్ అసహనం, అరాచకమన్న కేసీఆర్; 'పెద్దలు జానారెడ్డి'పై ఇలా
హైదరాబాద్: మండలి చైర్మన్ స్వామిగౌడ్పై దాడిని తీవ్రంగా పరిగణించిన స్పీకర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. అలాగే సీఎల్పీ నేత జానారెడ్డి సహా మరో 11మందిని సస్పెండ్ చేశారు.
మంగళవారం ఉదయం సభలో దీనిపై ప్రకటన చేశాక.. బీజేపీ సభ్యులకు కూడా స్పందించే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు.
మాట్లాడే అవకాశం ఇవ్వాల్సింది
సభ్యులను సస్పెండ్ చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టే ముందు వారికి మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలా జరగకపోవడంపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
జానారెడ్డి హుందాతనం కనిపించలేదా?
పార్లమెంటు వ్యవస్థలో ఇలా ఎవరూ చేసినా తప్పేనని.. అయితే బీఏసీ సమావేశంలో తన పశ్చాత్తపం వ్యక్తం చేసిన జానారెడ్డి హుందాతనాన్ని పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి నిర్ణయాలు శాసనసభకు శోభ తీసుకురావని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎంపీల ప్రస్తావన..:
కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై మాట్లాడుతున్న సమయంలోనే.. కిషన్ రెడ్డి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల నిరసనల గురించి కూడా ప్రస్తావించారు.
లేని పోని సమస్యలను సృష్టించి మరీ లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ ఆయన వాదనకు అడ్డుతగిలి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధ్యక్షా.. ఒకటే విషయం: కేసీఆర్
'అధ్యక్షా ఒకటే విషయం.. అరాచకాలకు మేము మద్దతు తెలుపుతాం అంటే మాకేమి అభ్యంతరం లేదు. సభలో లేనటువంటి ఎంపీల మీద మాట్లాడే అధికారం ఎవరికీ లేదు. ఏది పడితే అది మాట్లాడుతాం అంటే అదో అరాచకం.' అని కేసీఆర్ కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
నాలుగేళ్ల నుంచి.. 'పెద్దలు జానారెడ్డి':
అంతేకాదు, లోక్ సభలో అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి ఎంపీలు వ్యవహరిస్తారని, శాసనసభకు సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి చర్చించడం సబబు కాదని సూచించారు.
ఇక జానారెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. 'మాకు లేదా ఆయనపై గౌరవం.. అందరికంటే ముందు పెద్దలు జానారెడ్డిది అన్నది నేను. నాలుగేళ్లుగా ఆయన్ను అలాగే గౌరవిస్తున్నా' అంటూ కిషన్ రెడ్డికి బదులిచ్చారు.
ఇంత అసహనమా?
కిషన్ రెడ్డి వాదనపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసహనం మంచిది కాదన్నారు.
'నేనేమన్నా సార్.. ఇది అసహనం. నేనెవరినైనా తప్పు పట్టానా.. జానారెడ్డి పశ్చాత్తాపాన్ని దృష్టిలోకి తీసుకోవాలని తప్ప ఇంకోటి కాదు. పార్లమెంటులో ఇలా జరుగుతుందని చెప్పా అంతే.' అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
సస్పెండ్ అయిన సభ్యులు శాసనసభలో హుందాగానే కూర్చున్నారని, అకారణంగా వారిని సస్పెండ్ చేశారని అన్నారు. తాము ఎవరి దయాదాక్షిణ్యాలతో సభకు రాలేదని, వ్యక్తిగత ఎజెండాలేవి లేవని స్పష్టం చేశారు.
వారిదే ఆవేదనా.. మరి మావాళ్లది:
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ మళ్లీ స్పందించారు. 'సభ దానిపై ఒక నిర్ణయం తీసుకున్నది అయిపోయింది. గౌరవార్థం ఐదు నిమిషాలు మాట్లాడమని అడిగితే మళ్లీ ఈ ఇష్యూ ఏంది?. ప్రతిపక్ష సభ్యులదే ఆవేదన అయితే.. మిగతా 90మంది సభ్యుల ఆవేదనేంటి?.' అని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.