బండి సంజయ్కి అమిత్ షా ఫోన్: పవన్ కళ్యాన్ స్పందన, రఘునందన్ ఇంటికి కిషన్ రెడ్డి
హైదరాబాద్/దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు, ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు కలకలం సృష్టించాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ సోదాలను జరిపిన పోలీసులు.. రూ. 18 లక్షలు దొరికాయని చెబుతున్నారు.
రఘునందన్, బంధువుల ఇళ్లపై పోలీసుల తనిఖీ.. ఆ డబ్బు?
అయితే, తమ ఇళ్లల్లో పోలీసులకు ఎలాంటి డబ్బు దొరకలేదని, ఆ మొత్తం పోలీసులే పట్టుకొచ్చి తమ ఇంట్లో దొరికినట్లు చెబుతున్నారని రఘుననందర్ తెలిపారు. తనిఖీల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు అక్కడకి భారీగా చేరుకున్నారు. పోలీసుల వద్ద ఉన్న డబ్బును లాక్కొని.. పోలీసులు తెచ్చిన డబ్బంటూ అందరికీ చూపించారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల తోపులాటలో రఘునందన్ రావు సొమ్మసిల్లి పడిపోయారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయలయ్యాయి.
రఘునందన్ ఇంటికి కిషన్ రెడ్డి..
ఈ క్రమంలో సోమవారం రాత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రఘునందన్ రావు నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించారని చెప్పారు.
ఇళ్లంత చిందరవందర చేశారు. మహిళ అని కూడా చూడకుండా, కనీస మర్యాదపాటించలేదు. రఘునందన్ రావు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జితేందర్ రెడ్డి, వివేక్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని కిషన్ రెడ్డి అన్నారు.
అరెస్టులా? టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం..
దుబ్బాక ఎన్నికల ఇంఛార్జ్ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ను అరెస్ట్ చేసి బలవంతంగా హైదరాబాద్ పంపించారన్నారు. పోలీసులు ఎన్నికల కోడ్ను అతిక్రమించారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావును అధికార పార్టీ వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు. దుబ్బాక ఘటనలపై కేంద్ర నాయకత్వానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, వాటిలో చిక్కుకోకూడదని బీజేపీ నేతలకు సూచించారు.
బండి సంజయ్ అరెస్ట్.. దురుసుగా పోలీసులు..
రఘునందన్ రావును పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను సిద్దిపేటలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. పోలీసులు బలవంతంగా వాహనంలోకి తోసేయడంతో సంజయ్కు స్వల్పగాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయనను కరీంనగర్కు పంపించారు. పోలీసుల ప్రవర్తనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్గిపేట సీపీపై క్రిమినల్ కేసు పెట్టి, సస్పెండ్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.
బండి సంజయ్కు అమిత్ షా ఫోన్
ఎన్నికల సంఘం సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు దిగారు. రేపు కూడా తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. కాగా, ఈ క్రమంలో బండి సంజయ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. దుబ్బాక ఘటనపై ఆరా తీశారు. కేంద్ర బలగాలతో దుబ్బాకలో ఎన్నికలు జరిపించాలని ఈ సందర్భంగా అమిత్ షాను సంజయ్ కోరారు.
Recommended Video
బండి సంజయ్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన
కాగా, సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్టుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు అయిన వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని అన్నారు. సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని అన్నారు. పోలీసులు తమ విధులు నిర్వహించాలని, కానీ, ఇలా దుందుడుకుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ పైనా, బీజేపీ నాయకులపైనా పోలీసు చర్యలు సందేహాలకు తావిస్తోందన్నారు. ఉద్రిక్తతలకు తావిచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపజేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి, పార్టీ నేతలు, కార్యకర్తలను గురిచేసేలా వ్యవహరించడం గర్హనీయమన్నారు.