కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ: అందుకే జాబ్స్ నోటిఫికేషన్స్ గుర్తొచ్చాయి, పోలీసులకు కిషన్ రెడ్డి సూచన
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో టీఆర్ఎస్ పార్టీకి రాజీ కుదిరిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ అంటూ మోడీ ఫ్రంట్లో కేసీఆర్ చేరిపోయారని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
టీఆర్ఎస్ పనైపోయింది..
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతలు సహా పలు పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావడానికి ఎంతో దూరం లేదని జోస్యం చెప్పారు.
కేసీఆర్, కవితలపై కేసులు ఎందుకు పెట్టలేదు?
తెలంగాణలో టీఆర్ఎస్ చేసింది భారత్ బంద్ కాదని.. సర్కారీ బంద్ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. భారత్ బంద్లో పాల్గొన్న కేసీఆర్, కవితలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు సహకరించినట్లే.. ఇకపై బీజేపీ చేసే నిరసన కార్యక్రమాలకు కూడా పోలీసులు సహకరించాలన్నారు.
వ్యవసాయ రంగాన్ని గాడిలో పెడతాం.. మంత్రులకు సిగ్గులేదా?
భారత్ బంద్లో రాష్ట్ర మంత్రులు పాల్గొనడం సిగ్గుచేటని.. రాజకీయంగా ప్రధాని మోడీని ఎదుర్కోలేకే కొత్త వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్దతను కల్పిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాక, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో సీడ్ డెవలప్మెంట్ కోసం ఐటీసీ కంపెనీని ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. గత 70 ఏళ్లుగా దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు. రైతుల ఉద్యమం కేవలం పంజాబ్కు మాత్రమే పరిమితమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల రైతులకు యూరియాను అందించనున్నామని ఆయన తెలిపారు. రైతులకు విద్యుత్ కోతలు, ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి వివరించారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ దెబ్బతో కేసీఆర్కు ఉద్యోగాలు గుర్తొచ్చాయి
దుబ్బాక, జీహెచ్ఎంసీలో తగిలిన దెబ్బతోనే సీఎం కేసీఆర్కు ఉద్యోగాల నోటిఫికేషన్స్ గుర్తుకొచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధిలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. నల్లా నీళ్లలో డ్రైనేజీ మురుగునీరు కలుస్తుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని చాలా కాలనీలు, బస్తీల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.