టెర్రరిస్ట్స్ పోతే మీ బాధేంటి: కిషన్, కేసీఆర్కి శోభ లేఖ
హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు చనిపోతే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎందుకు అంతలా బాధపడిపోతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి గురువారం ప్రశ్నించారు.
బీజేపీ కార్యాలయంలో ఆలె నరేంద్ర వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేయాలన్నారు. పోలీసులను, సామాన్య ప్రజలను ఉగ్రవాదులు చంపినప్పుడు మానవహక్కుల గురించి మజ్లిస్ నేతలు నోళ్లు ఎందుకు పెగల్లేదన్నారు.
కాగా, వికారుద్దీన్ మృతి పైన మహమూద్ అలీ మాట్లాడుతూ.. చట్టపరంగా వికారుద్దీన్ గ్యాంగ్ విచారణను ఎదుర్కొని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. వికారుద్దీన్, అతడి అనుచరుల ఎన్కౌంటర్ బాధాకరమని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. గ్రేటర్ పీఠాన్ని తాము కైవసం చేసుకుంటామని చెప్పారు.
కమిషన్ కాకతీయ అవుతోంది: శోభారాణి
తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం కాస్తా కమిషన్ కాకతీయగా మారిపోయిందని తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆమె బహిరంగ లేఖ రాశారు.
మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని కోరారు. డ్వాక్రా ఆధ్వర్యంలో నిజాయితీగా పనులు జరుగుతాయన్నారు. చెరువుల పునరుద్ధరణ పేరుతో మహిళా దళారీలు తయారవుతున్నారని, గులాబీ చొక్కా వేసుకున్న వారికే అవకాశాలిస్తున్నారన్నారు.