కేసీఆర్! నీకు చేతకాకుంటే మేం తెస్తాం: కిషన్, ఎర్రబెల్లి నిప్పులు, 10న తెలంగాణ బంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాదని ఒప్పుకుంటే మేం కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకు వచ్చేందుకు సిద్ధమని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం కౌంటర్ ఇచ్చారు.
బిజెపికి లేదా కేంద్రానికి చెప్పి కెసిఆర్ రైతు రుణమాఫీ పైన హామీ ఇచ్చారా అని నిలదీశారు. అయినప్పటికీ.. తనకు చేతకాదు అని కెసిఆర్ ఒప్పుకుంటే మేం కేంద్రం నుంచి నిధులు తీసుకు వచ్చేందుకు సిద్ధమని చెప్పారు.రైతులకు తప్పుడు హామీలు ఇచ్చామని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవాలని సూచించారు.
నిధులు లేవని చెబుతున్న కేసీఆర్కు ఎన్నికల ముందు ప్రజలకు, రైతులకు హామీలు ఇచ్చినప్పుడు ఆ విషయం తెలియదా అన్నారు. బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను వంచించడం సరికాదన్నారు. నిధులు లేకపోతే ఇతర పథకాలు ఎలా చేపడుతున్నారన్నారు.
రుణమాఫీ ఏకమొత్తంలో చెల్లించాలి: ఎర్రబెల్లి
రైతుల రుణమాఫీ ఏక మొత్తంలో చెల్లించాలని తెలంగాణ టిడిపి శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం డిమాండ్ చేశారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. శాసనసభలో ప్రతిపక్ష పార్టీలను కనీసం 5 నిమిషాలు కూడా నిరసన తెలపనీయలేదని విమర్శించారు.
ఎర్రబెల్లి కెసిఆర్కు చురకలు అంటించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కెసిఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నీ తప్పులు లేదా అల్లుడు హరీష్ రావు మిషన్ కాకతీయలోని అవినీతి లేదా, కొడుకు కెటిఆర్ వాటర్ గ్రిడ్ పథకంలోని అవినీతి బయటకు వస్తుందని అడ్డుకుంటున్నారా అన్నారు.
అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. వాటర్ గ్రిడ్ పైన మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... ఇది పైప్ లైన్ కాదని, లైఫ్ లైన్ అంటున్నారని.. కానీ, అది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల లైఫ్ లైన్ అని కౌంటర్ ఇచ్చారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలు బయటపడతాయనే విపక్షాలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. కెసిఆర్ది నియంత పాలన అన్నారు. రైతులకు రుణమాఫీ ఒకేసారి చేయాలన్నారు.
10న తెలంగాణ బంద్: వామపక్షాలు
అసెంబ్లీ నుంచి విపక్షాలను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం ద్వారా కెసిఆర్ అందరికంటే పెద్ద నియంతనని నిరూపించుకున్నారని వామపక్షాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కెసిఆర్ నియంతనని నిరూపించుకున్నారన్నారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణ బంద్కు పది వామపక్షాలు పిలుపునిచ్చాయి.