లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తా, నన్నూ లాగారు.. కపిల్ సిబాల్పై దావా వేస్తా: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తాను లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. తమ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయేనని, థర్డ్ ఫ్రంట్ అని ఇన్నాళ్లు చెప్పుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని నిలదీశారు. 16 మంది ఎంపీలతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమయ్యే పనేనా అని ఎద్దేవా చేశారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, వీరేం చేస్తారు..: విప్ వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనా?
కాంగ్రెస్కు తెరాస బీ-టీం
తెరాసకు ఓటు వేస్తే కల్వకుంట్ల వారికి గులామ్ కావాల్సిందేనని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పారు. కాంగ్రెస్కు బీ-టీమ్గా టీఆర్ఎస్ మారిందన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించగలదా అని ప్రశ్నించారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని, కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
కపిల్ సిబాల్ పైన సంచలన నిర్ణయం
2014 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ పైన తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సిబాల్తో పాటు సయ్యద్ సుజపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. కపిల్ సిబల్, సయ్యద్ సుజ చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.
నాపేరును లాగారు
ఎన్నికల సంఘం సైతం ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తనపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ దర్యాఫ్తు చేయాలని సిబాల్ అన్నారని గుర్తు చేశారు. సీబీఐ ద్వారా విచారణ చేస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.