43వేల కోట్లు కేంద్రంవే: కిషన్, ఎమ్మెల్యే యూ టర్న్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రూ.43వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానివేనని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. కేంద్ర నిధులు పొందిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్తు తెలంగాణ బీజేపీ నేతల ఒత్తిడి ఫలితమేనని చెప్పారు. కరంటు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ కేసీఆర్ సిద్ధంగా లేరని విమర్సించారు.
బడ్జెట్ మోసపూరితం: నాగం
తెరాస ప్రభత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైనదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. తన కుటుంబాన్ని బంగారం చేసుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని నాగం వ్యాఖ్యానించారు.
బడ్జెట్ తెలంగాణ ప్రజల మెప్పు పొందింది: వినోద్
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రజల మెప్పు పొందిందని పార్లమెంటు సభ్యుడు, తెరాస నేత వినోద్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. తొలి బడ్జెట్పై మీడియా గొప్పగా స్పందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. లక్ష కోట్ల బడ్జెట్ పెట్టడం ఊహకందని విషయమన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బిక్షమెత్తుకుంటారన్న సమైక్యవాదులకు ఈ బడ్జెట్ గొడ్డలిపెట్టు అని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ దిశగా బడ్జెట్ ఉందన్నారు.
యాదయ్య యూ టర్న్
చేవేళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య కారు తెరాసలో చేరాలని ఇటీవల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రెడ్యానాయక్తో పాటే యాదయ్య కూడా తెరాసలో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బుధవారం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన కాంగ్రెస్ కండువాతో వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే.
కాగా, 'నాయనా, బతుకమ్మ పండగ చేసుకుంటా' అని ఎంపీ కవిత అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పది కోట్ల రూపాయలు కేటాయించారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి బుధవారం ఎద్దేవా చేశారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన హైదరాబాదులో మాట్లాడారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులు చదువుకునేందుకు నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూస్తే రూ.25 కోట్లు విదిలించారన్నారు. అంటే లెక్కల ప్రకారం చూస్తే ప్రతి విద్యార్థికి ఛాయ్ డబ్బులిచ్చారన్నారు. ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిన ముఖ్యమంత్రికి తన మాటలు గుర్తు లేవా? అని ఆయన నిలదీశారు. కొడుకు, అల్లుడు శాఖలకు ఎక్కువగా నిధులు కేటాయించారన్నారు.