గ్రేటర్ బరిలో కేకే కూతురు: బంజారాహిల్స్ నుంచి నామినేషన్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో రాజకీయం ఊపందుకుంది. రేపే నామినేషన్లకు చివరి తేదీ కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, కే. కేశవరావు కూతురు భాగ్యలక్ష్మీ జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
బంజారాహిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా గద్వాల భాగ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ టికెట్ దక్కించుకున్న ఆమె శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా, భారతీనగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థిగా సింధూ ఆదర్శరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు.
దీంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనుండటంతో ఆయా కార్యాలయాల పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. కాగా, టీఆర్ఎస్ శుక్రవారానికి 80 మంది అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 45 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
మరోవైపు జీహెచ్ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మెజారిటీ సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. గ్రేటర్లోని 150 డివిజన్లలో టిడిపి 90 స్థానాల్లో, బిజెపి 60 సీట్లలో పోటీ చేయనున్నాయి.