గవర్నర్కు డిసిప్లేన్ లేదా, ఢిల్లీలో మీరు వెళ్లట్లేదా: జీవన్, 'స్వామిగౌడ్ కార్నియా దెబ్బతింది'
హైదరాబాద్: అసెంబ్లీలో సోమవారం ఉదయం జరిగిన ఘటనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిన్నటి టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తమపై కుట్ర జరిగిందన్నారు.
Recommended Video
అసెంబ్లీలో హెడ్పోన్ విసిరిన కోమటిరెడ్డి, గాయపడిన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
నిరసన తెలిపితే సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తామని ఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్కు ఎంతో బాధ్యత ఉంటుందని, గవర్నర్కు డిసిప్లేన్ ఉండదా అని ప్రశ్నించారు.
గవర్నర్ ఆలస్యంగా ఎలా వస్తారు
గవర్నర్ సభకు ఆలస్యంగా ఎలా వస్తారని జీవన్ రెడ్డి నిలదీశారు. ఉదయం గవర్నర్ ప్రసంగం సమయంలో పెద్ద ఎత్తున సభలో మార్షల్స్ను మోహరించారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోన్న విషయం తెలిసిందే. మార్షల్స్ బలవంతంగా తోస్తున్న సమయంలోనే కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారని చెబుతున్నారు. మార్షల్స్ కారణంగా తాను వెనక్కి వెళ్లి కూర్చున్నానని కూడా జానారెడ్డి చెప్పారు.
సభలో దాడి, హద్దులు దాటింది
శాసన మండలిలో చైర్మన్ కంటికి గాయమైన అంశంపై టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావు మాట్లాడుతూ.. చైర్మన్ స్వామి గౌడ్ కంటి కార్నియా దెబ్బతిన్నదని వైద్యులు చెబుతున్నారని చెప్పారు. స్వామి గౌడ్ పైన అసెంబ్లీలో దాడి జరగడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనల స్థాయి హద్దులు దాటిందన్నారు.
వాళ్లూ పోడియం వద్దకు
స్వామి గౌడ్ అంటే తనకు అభిమానమని, ఆయనకు ఎలాంటి గాయం కాలేదని కోమటిరెడ్డి అన్నారు. పోడియం వద్దకు వెళ్లే హక్కు తమకు ఉందన్నారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు రోజు పోడియం వద్దకు వెళ్లడం లేదా అని నిలదీశారు.
తాగి వచ్చానని నిరూపిస్తే తప్పుకుంటా
తాను తాగి వచ్చానన్న వ్యాఖ్యలని కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తాగి వచ్చానని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఇంత చెత్త ప్రసంగం తాను ఎప్పుడూ వినలేదని మండిపడ్డారు. తాగి వచ్చారని చెప్పడం తీవ్ర అవమానమని, పేపర్లు, మైకులు విసరడం కొత్తేమి కాదని కాంగ్రెస్ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. పార్లమెంటులోను పేపర్లు విసిరిన సందర్భాలు ఎన్నో అంటున్నారు.