విషాదం: అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి
నల్గొండ: సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్(26) అమెరికాలో ప్రమాదవశాత్తూ బోటు ప్రమాదంలో మృతి చెందాడు. గత మూడేళ్లుగా అమెరికాలో ఓ ప్రైవేటు కంపెనీలో రవికుమార్ పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి బీచ్లో బోటింగ్కు వెళ్లాడు.
ఈ క్రమాంలో ప్రమాదవశాత్తు నీళ్లలో పడి రవికుమార్ మృతి చెందాడు. ఈ విషయాన్ని అమెరికాలోని రవికుమార్ స్నేహితులు కోదాడలో ఉంటున్న రవికుమార్ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో రవికుమార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కన్నకొడుకు మృతదేహాన్ని కడసారి చూపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రవికుమార్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే రవికుమార్పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రవికుమార్ మృతితో అతని కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.