నో పర్మిషన్: ఇంట్లోనే కోదండరామ్ దీక్ష, అసెంబ్లీని బహిష్కరించిన విపక్షాలు
తెలంగాణ జెఎసి చైర్మన్ కోడండరామ్కు పోలీసులు షాక్ ఇచ్చారు. పోలీసులు నిరాకరించడంతో ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు.
హైదరాబాద్: తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్కు పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద గురువారం తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భూనిర్వాసితుల సమస్యలపై ఆయన దీక్షను తలపెట్టారు. అనుమతి నిరాకరణతో కోదండరామ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ఆగ్రహంతో ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. పలు చోట్ల తెలంగాణ జెఎసి నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. తెలంగాణ జెఎసి కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడిస్తారనే అనుమానంతో భారీగా పోలీసులను దించారు. అసెంబ్లీలోకి అనుమతించే విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భూసేకరణ చట్టానికి నిరసనగా కోదండరామ్ దీక్షను తలపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారంనాడు అసెంబ్లీలో భూసేకరణ చట్టాన్ని ఆమోదించింది. గత కొంత కాలంగా కోదండరామ్ కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణకు దిగారు.
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇందిరా పార్కు వద్ద ధర్నాను రద్దు చేసుకుంటున్నట్లు కోదండరామ్ బుధవారం రాత్రి ప్రకటించారు. అయితే, జెఎసి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆగ్రహించిన కోదండరామ్ ఇంట్లో దీక్షకు దిగారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎవరినీ ఆయన ఇంట్లోకి అనుమతించడం లేదు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం నిరంకుశంగా వ్య.వహరించడం సరి కాదని కోదండరామ్ అన్నారు. జిల్లాల నుంచి వస్తున్న జెఎసి నేతలను అరెస్టు చేశారని ఆయన చెప్పారు. అక్రమ అరెస్టులు తగదని ఆయన అన్నారు. భూనిర్వాసితుల కోసం తాము గురువారం ఇందిరా పార్కు వద్ద ధర్నాను తలపెట్టామని, బుధవారం రాత్రి పదిన్నరకు పోలీసులు ఫోన్ చేసి ధర్నాకు అనుమతి లేదని చెప్పారని ఆయన వివరించారు.
అసెంబ్లీ బహిష్కరణ
కాగా, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షాలు స్పీకర్ మధుసూదనాచారికి విడివిడిగా లేఖలు రాశాయి. కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఎం నాయకులకు ఆ మేరకు లేఖలు రాశారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా వారు అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
సభ ప్రారంభానికి ముందే తెలుగుదేశం, కాంగ్రెసు శాసనసభ్యులు స్పీకర్తో సమావేశమయ్యారు. భూసేకరణ చట్టం ఆమోదం సందర్బంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానించారని వారన్నారు. మీ పద్ధతి కూడా బాగాలేదని వారు స్పీకర్కు చెప్పినట్లు సమాచారం.
కాగా, ప్రతిపక్షాలకే మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇచ్చామని శాసనసభా వ్యవవహారాల మంత్రి హరీష్ రావు అన్నారు. కోదండరామ్ 24 గంటలకు దీక్షకు మద్దతు తెలియజేయాలని కాంగ్రెసు, టిడిపి నిర్ణయించారు. జానారెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు శాసనసభ్యులు సమావేశమయ్యారు.