చంద్రబాబు కుట్రలు, పెద్దల సహాయ నిరాకరణ: కోదండరామ్
ఖమ్మం: రాష్ట్రంలోని 55 వేల మంది ఉద్యోగులను విభజించకపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుట్రలకు ఢిల్లీ పెద్దల సహాయ నిరాకరణ తోడైందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుంటే చిటికె లో ఉద్యోగుల విభజన జరిగిపోతుందని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో టీటీడీసీ భవనంలో తెలంగాణ అభివృద్ధి, ఉద్యోగుల విభజనపై జేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు.ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోనంతవరకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో తాత్సారం జరుగుతుందన్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రధాన పంటలైన వరి, మిర్చికి అనుబంధ పరిశ్రమలను నెలకొల్పి రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీ, స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్ర భుత్వ ఉద్యోగులు నిర్వహించిన 42 రోజుల సకల జనుల సమ్మెను ప్రత్యేక సెలవు పరిగణించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఉద్యోగ ఫ్రెండ్లీ అనడానికి నిదర్శనమని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి చెప్పారు.
వరంగల్ ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయంలో టీఎన్జీవో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడారు. సమ్మెకాలాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవుగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.