కోదండరాం కొత్త పార్టీ: 'తెలంగాణ జనసమితి'తో రాజకీయాల్లోకి..
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం తన పంథాను రాజకీయ పోరాటం వైపు మళ్లించారు. ఇన్నాళ్లు ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ వచ్చిన ఆయన.. ఇక రాజకీయకంగానే అమీ తుమీకి సిద్దమయ్యారు.
ఈ నేపథ్యంలో 'తెలంగాణ జనసమితి' పేరుతో ఆయన కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారు. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పార్టీ పేరును సోమవారం అధికారికంగా ఖరారు చేశారు.
29న ఆవిర్భావ సభ:
ఈ నెల 29న హైదరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ కోసం సన్నాహక కమిటీలను నియమించినట్టు కోదండరాం తెలిపారు.
పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పటికే పోలీసుల అనుమతి కోరారు కోదండరాం. పరేడ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలలో.. ఏదేని ఒకదాంట్లో సభ జరుపుకోవడానికి అనుమతినివ్వాలని కోరారు.
జెండా నమూనాపై:
తెలంగాణ జనసమితి జెండా తెలుపు, నీలిరంగు, ఆకుపచ్చ రంగుల్లో ఉండబోతుందని తెలుస్తోంది. రైతులు, కార్మికులను ఆకట్టుకోవడానికే ఆ రంగుల్లో జెండా నమూనా తయారుచేసినట్టు సమాచారం. జెండా నమూనా కోసం పరకాల సలహా తీసుకుంటున్నట్టు కోదండరాం తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే:
రాష్ట్రం వచ్చాక మన వనరులు మనకే దక్కుతాయనుకున్నామని, అలా జరగనందువల్ల రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
సుదీర్ఘ ఆలోచనల తర్వాతే పార్టీ ఏర్పాటు దిశగా కదిలామని అన్నారు. రైతులు, నిరుద్యోగులు అసంతృప్తిలో ఉన్నారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే పార్టీ పెడుతున్నామని తెలిపారు. రాజకీయాల పట్ల తనకు ద్వేషం లేదని, రాజకీయాలు దేశానికి గుండెకాయ లాంటివి అని స్పష్టం చేశారు.
సెక్రటేరియట్కు రాని సీఎం?:
రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్కు రాని సీఎంను తెలంగాణలో మాత్రమే చూశానని కోదండరాం పేర్కొన్నారు. ధర్మ గంట కొట్టినా సీఎం దర్శనం లేదని ఎద్దేవా చేశారు.
విధి విధానాలేంటి?:
'తెలంగాణ జనసమితి' విధి విధానాల గురించి ఏప్రిల్ 4న మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ కార్యాచరణ గురించి ఈ నెల 29న జరిగే ఆవిర్భావ సభలో ఒక ప్రకటన చేయవచ్చు.
2019ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందా?.. లేక పొత్తులు ఉంటాయా? అన్నది కూడా ఆసక్తికరం. కోదండరాం రాజకీయ తెరంగేట్రంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.