కేసీఆర్! రెచ్చగొడుతున్నారా?: కోదండరాం తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనపై చేసిన విమర్శలకు జేఏసీ ఛైర్మన్ కోదండరాం కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ భాష, మాట తీరు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనపై చేసిన విమర్శలకు జేఏసీ ఛైర్మన్ కోదండరాం కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ భాష, మాట తీరు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఆయన మాటలున్నాయని వ్యాఖ్యానించారు.
అందుకే వ్యక్తిగత విమర్శలు
సమస్యలపై సమాధానం చెప్పలేకనే తనపై వ్యక్తి విమర్శలకు దిగుతున్నారని కేసీఆర్ పై కోదండరాం మండిపడ్డారు. కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కోదండరాం చెప్పారు. ఏ ఒక్కరి కారణంగానో తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణ సమాజం సమష్టి కృషితో రాష్ట్రాన్ని సాధించుకుందామని కోదండరాం చెప్పారు.
తేడా ఏంటి?
గుప్పెడంతమంది అధికారం కోసం తెలంగాణ సాధించుకోలేదని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. జేఏసీ ఉద్యమ లక్ష్యంతో ముందుకెళ్తోందని కోదండరాం అన్నారు. గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుగానే కేసీఆర్ సర్కారు కూడా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కొనుగోళ్లు సాగుతూనే ఉన్నాయి..
పార్టీ ఫిరాయింపులు తెలంగాణ వచ్చిన తర్వాత ఉండవనే అనుకున్నా.. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. అంతేగాక, అధికారమంతా కేసీఆర్ చేతిలోనే ఉంచుకున్నారని అన్నారు. అధికారులు, మంత్రులతో మాట్లాడకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని, మంత్రులు పర్యటనలో ఉన్న సమయంలో కేసీఆర్ ఆ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
వారు ఉత్స విగ్రహాలేనా?
కేసీఆర్ మంత్రి వర్గంలో సామాజిక సమతూకం లేదన్న కోదండరాం.. మంత్రులకు అధికారం కూడా లేదని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని అన్నారు. ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్కు రారని, ప్రజలు ప్రగతి భవన్ కు వెళ్లలేరని కోదండరాం అన్నారు.
కేసీఆర్ విఫలం
రాష్ట్రంలో భూములు కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోందని కోదండరాం ఆరోపించారు. అవినీతి, అక్రమాలను అరికట్టడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి కోసం జేఏసీ కృషి చేస్తోందని అన్నారు. సామాజిక దృష్టి కోణంలో జేఏసీని చూడాలని అన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం సౌకర్యాలు లేకుండా పోయాయని అన్నారు. సర్కారు ఆస్పత్రులు సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం కోసం నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. అవకతవకలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.