కోదండరామ్ కొత్త పార్టీ: ఏప్రిల్ 2న ఆవిర్భావం, భారీ బహిరంగ సభ
హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ నేతృత్వంలో కొత్త పార్టీ ప్రారంభం కానుంది. తెలంగాణ జన సమితి పేరుతో టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ రెండున కోదండరామ్ తెలంగాణ జన సమితి పేరును ప్రకటించనున్నారు.
ఏప్రిల్ రెండవ తేదిన తెలంగాణ జన సమితికి సంబంధించిన కోదండరామ్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ జన సమితికి ఎన్నికల కమిషన్ నుండి అన్ని అనుమతులు వచ్చాయని జెఎసి వర్గాలు ప్రకటించాయి.
ఏప్రిల్ 4న తెలంగాణ జన సమితికి చెందిన పార్టీజెండాను ఆవిష్కరిస్తారని జెఎసి వర్గాలు ప్రకటించాయి. అయితే ఏప్రిల్ 29న, భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు జెఎసి వర్గాలు చెబుతున్నాయి. ఈ సభలోనే పార్టీ విధి విధానాలను కోదండరామ్ ప్రకటించే అవకాశం ఉంది .
ఏప్రిల్ 29న హైద్రాబాద్లో సభ ఏర్పాటు కోసం జెఎసి నేతలు రంగం సిద్దం చేసుకొంటున్నారు. హైద్రాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియంలలో ఏదో ఒక చోట సభను నిర్వహించాలని కోదండరామ్ భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ అవసరమని జెఎసి భావించింది. ఈ మేరకు పార్టీని ప్రారంభించాలని కోదండరామ్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జెఎసి సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు.