రిస్క్ ఎందుకు: కాంగ్రెస్ గుర్తుపైనే కోదండం రాం పార్టీ అభ్యర్థులు పోటీ..?
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళుతుండగా ప్రజాకూటమి మాత్రం ఇంకా సీట్ల పంపకాలపైనే కాలయాపన చేస్తోంది. టీడీపీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి ఈ మధ్యే అగ్గిపెట్ట గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. కానీ ఆ గుర్తు ప్రజల్లోకి ఇంకా వెళ్లలేదు. దీంతో రిస్క్ చేయడం ఎందుకని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ టికెట్ పై టీజేఎస్ పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?
తెలంగాణలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైనే తెలంగాణ జనసమితి అభ్యర్థులు పోటీ చేసేందుకు సాధ్యసాధ్యాలపై చర్చించేందుకు ఇటు కాంగ్రెస్, అటు తెలంగాణ జనసమితి నేతలు ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇలా తమ అభ్యర్థులు తమ పార్టీకి కేటాయించిన గుర్తు కాకుండా మరొక గుర్తుపై పోటీచేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమవుతాయి, ఒక వేళ చిక్కులుంటే వాటిని ఎలా పరిష్కరించాలనేదానిపై ఎన్నికల సంఘం సలహాను కోరేందుకు ఇరు పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లారు.
టీజేఎస్ అభ్యర్థులు గెలిస్తే వారిని ఏ పార్టీ అభ్యర్థులుగా గుర్తిస్తారు..?
ఇక కాంగ్రెస్ గుర్తుపై తెలంగాణ జనసమితి పార్టీ అభ్యర్థులు పోటీ చేసి వారు గెలిస్తే ఆ అభ్యర్థులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తారా.. లేదా తెలంగాణ జనసమితి అభ్యర్థులుగా గుర్తిస్తారా అని ఎన్నికల సంఘాన్ని అడిగినట్లు తెలుస్తోంది.అయితే ఇది అసెంబ్లీ స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని ఎన్నికల అధికారులు తెలిపినట్లు సమాచారం. అగ్గిపెట్ట గుర్తు ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్లలేదన్న కాంగ్రెస్, తటస్థ ఓటర్లు మీమాంసకు గురై టీజేఎస్ పార్టీకి ఓటు వేయకపోయే అవకాశం ఉందని దీనివల్ల టీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూరుతుందని హస్తం నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేయి గుర్తు ప్రతి ఓటరుకు తెలుసు కాబట్టి గుర్తు పట్టడం సులభంగా ఉండటంతో పాటు ఓటు కూడా వేస్తారని హస్తం పార్టీ నేతలు వివరించారు.
అగ్గిపెట్టె గుర్తుపై పోటీ చేస్తే రిస్క్ చేసినట్లే అంటున్న కూటమి మిత్రులు
ఇదిలా ఉంటే తెలంగాణ జనసమితి పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా మరో వాదన వినిపిస్తోంది. అయితే కూటమిలోని ఇతర పార్టీలు అయిన టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి సభ్యులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో రిస్క్ చేయడం సరికాదని వారు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీజేఎస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేసేలా కోదండరాంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ గుర్తుపైనే టీజేఎస్ అభ్యర్థులు పోటీ చేసి గెలిస్తే అసెంబ్లీలో మాత్రం వారిని పార్టీ ఫిరాయింపుదారులుగా స్పీకర్ చూసే వీలు లేదని నిపుణులు చెబుతున్నారు.